అక్కడే ఉదయం పూజలు-మధ్యాహ్నం నమాజ్..! సుప్రీం సంచలన తీర్పు..!
దేశవ్యాప్తంగా పలు చోట్ల చారిత్రక కట్టడాల యాజమాన్య హక్కుల విషయంలో హిందూ-ముస్లింల మధ్య వివాదాలు నెలకొంటున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని ఓ ప్రార్ధనా స్థలం విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ఒకే రోజు హిందువులు తమ పూజలు , ముస్లింలు తమ నమాజ్ చదువుకునేందుకు అవకాశమిస్తూ చారిత్రక తీర్పు వెలువరించింది. దీంతో ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
మధ్యప్రదేశ్ లోని ధార్ లో భోజ్ శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ యాజమాన్య హక్కుల విషయంలో వివాదం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఒకేరోజు (శుక్రవారం) ఇరు వర్గాలూ పూజలు, ప్రార్ధనలు జరుపుకోవాల్సిన అవసరం వచ్చింది. హిందువులు బసంత పంచమి సందర్భంగా ఈ ఆలయంలో తప్పనిసరిగా పూజలు చేయాల్సి ఉంది. అలాగే ముస్లింలు ఈ మసీదులో తప్పనిసరిగా శుక్రవారం నమాజ్ ఆచరిస్తారు.

వసంత పంచమి నాడు ఇక్కడ హిందువులు ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక హక్కులను కోరుతూ హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ (HFJ) అనే హిందూ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. అనంతరం ఈ సంవత్సరం శుక్రవారం వచ్చే హిందూ పండుగ బసంత్ పంచమి నాడు హిందూ సమాజ సభ్యులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ముస్లింలు అదే శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు మసీదులో ప్రార్థనలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

నమాజ్ కోసం వచ్చే ముస్లిం సమాజం నుండి వ్యక్తుల జాబితాను జిల్లా అధికారులకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్మల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అలాగే ఇరువర్గాలు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పరస్పర గౌరవాన్ని పాటించాలని , రాష్ట్ర మరియు జిల్లా అధికారులకు సహకరించాలని ఇరుపక్షాలకూ సుప్రీంకోర్టు సూచించింది. ఈ సందర్భంగా ధార్ లో 8 వేల మంది పోలీసుల్ని మోహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications