కరోనా విజృంభిస్తే భారత్ తట్టుకోగలదా.. 'మే'లో గండం పొంచి ఉందా..? సైంటిస్టుల వార్నింగ్
కరోనా వైరస్ నియంత్రణకు భారత్ చేస్తున్న కృషిని డబ్ల్యూహెచ్ఓ అభినందించిన సంగతి తెలిసిందే. అయితే సైంటిస్టులు మాత్రం భారత్ను హెచ్చరిస్తున్నారు. ఇప్పుడున్న లెక్కల ఆధారంగా చర్యలు తీసుకుంటే.. వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేసినట్టవుతుందంటున్నారు. ఇందుకు అమెరికా,ఇటలీ ఉదంతాలే కళ్ల ముందు కనిపిస్తున్న ఉదాహరణలు అని చెబుతున్నారు. ఇండియా జనాభా,ఇక్కడున్న వైద్య వసతుల రీత్యా భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరించడం అవసరం అంటున్నారు.

సైంటిస్టులు ఏమంటున్నారు..
కోవిడ్-19పై అధ్యయనం చేస్తున్న ఓ ఇంటర్ డిసిప్లినరీ గ్రూపుకు చెందిన స్కాలర్స్,డేటా సైంటిస్టులు భారత్లో కరోనా విస్తరణపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భారత్లో కరోనా స్క్రీనింగ్ టెస్టుల సంఖ్య అతి తక్కువగా ఉందని.. మార్చి 18 నాటికి కేవలం 11,500 మందిని మాత్రమే స్క్రీనింగ్ చేశారని తెలిపారు. కరోనా వైరస్కు ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుగొనని నేపథ్యంలో.. వైరస్ ఒకవేళ మూడో దశలోకి ప్రవేశిస్తే వినాశనకర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. భారత్లో ఉన్న హెల్త్ కేర్ వ్యవస్థపై అది తీవ్ర దుష్ప్రభావం చూపుతుందన్నారు.

మే నెలలో గండం పొంచి ఉందా..
అమెరికా,ఇటలీ లాంటి దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ.. ఒక్కసారిగా విస్ఫోటనం చెందిందని అన్నారు. ఇప్పటికైతే ఇతర దేశాలతో పోలిస్తే వైరస్ను భారత్ నియంత్రిస్తున్నట్టే కనిపిస్తున్నా.. మే నెలలో సగం రోజులు గడిచే నాటికి 13లక్షలకేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం.భారత్లో తక్కువ స్క్రీనింగ్ టెస్టులు జరుగుతున్న మూలంగా.. మొదటి దశలో వచ్చిన డేటాను ఆధారంగా చేసుకుని వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. మార్చి 19 వరకు భారతదేశంలో COVID-19 కేసుల వృద్ధి రేటు సుమారు 13 రోజుల లాగ్తో అమెరికా నమూనానే తలపిస్తోందన్నారు. అమెరికాలోనూ ప్రారంభ దశలో అక్కడి కేసుల సంఖ్య ఇటలీ మొదటి 11 రోజుల దశకు దగ్గరగా ఉందన్నారు.
Recommended Video

మన మెడికల్ వ్యవస్థ తట్టుకోగలదా..
కరోనా వైరస్ లాంటి పరిస్థితులను ఎదుర్కొనే వసతులు భారత్ హెల్త్ కేర్ వ్యవస్థకు లేవని సైంటిస్టులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పరిశీలిస్తే.. ఇండియాలో ప్రతీ 1000 మందికి 0.7 పడకలు మాత్రమే ఉన్నాయి. అదే ఫ్రాన్స్లో ప్రతీ వెయ్యి మందికి 6.5,సౌత్ కొరియాలో 11.5,చైనాలో 4.2,ఇటలీలో 3.4,బ్రిటన్లో 2.9,అమెరికాలో 2.8,ఇరాన్లో 1.5 పడకలు ఉన్నాయి. ఇదే విషయంపై ఇటీవల ఓ తెలుగు న్యూస్ చానెల్తో అమెరికాలో పనిచేస్తున్న ఓ తెలుగు డాక్టర్ మాట్లాడాడు. ఆయన అభిప్రాయం ప్రకారం.. భారత్లో కరోనా గనుక విజృంభిస్తే మన మెడికల్ వ్యవస్థ తట్టుకోవడం కష్టం. హైదరాబాద్ లాంటి నగరంలోనే కేవలం 600-700 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని.. పేషెంట్ల సంఖ్య వేలల్లోకి చేరుకుంటే మన మెడికల్ వ్యవస్థ దాన్ని డీల్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications