స్కార్పీన్ జలాంతర్గామి కీలక పత్రాలు లీక్: పారికర్ ఏమన్నారు?
న్యూఢిల్లీ/ముంబై: భారత రక్షణకు సంబంధించిన కీలక సమాచారం లీక్ అవడం సంచలనం రేపుతోంది. భారత నౌకాదళం కోసం ఫ్రాన్స్ సంస్థ డీసీఎన్ఎస్ నిర్మిస్తున్న స్కార్పీన్ తరగతి జలాంతర్గాములకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలు లీకయ్యాయి. మొత్తం 22,400 పత్రాలు బహిర్గతమయ్యాయి. వాటిలో ఈ జలాంతర్గాములకు సంబంధించిన పోరాట సామర్థ్య వివరాలు ఉన్నాయి.
'ది ఆస్ట్రేలియన్' పత్రిక ఈ మేరకు ఒక కథనాన్ని ప్రచురించింది. భారత్కు ప్రత్యర్థులైన పాకిస్థాన్, చైనా వంటి దేశాలకు ఈ సమాచారం లభిస్తే వారికి గూఢచర్య పరంగా పెద్ద విజయమవుతుంది. 300 కోట్ల డాలర్ల(సుమారు రూ. 24వేల కోట్లత)తో ఆరు స్కార్పీన్ జలాంతర్గాములను ఫ్రాన్స్ సాయంతో భారత్ నిర్మిస్తోంది. ఇందులో మొదటిది నిర్మాణం పూర్తి చేసుకొని.. సముద్ర పరీక్షల దశలో ఉంది.
మిగతా జలాంతర్గాములతో పోలిస్తే వీటిలో అధునాతన స్టెల్త్ (శత్రువుకు ఆచూకీ దొరకని) లక్షణాలు ఉన్నాయని నౌకాదళం చెబుతోంది. జలాంతర్గామి పోరాట, పనితీరు సామర్థ్య వివరాలు వెల్లడైతే దాని గోప్యతకు విఘాతం కలుగుతుంది. 'ది ఆస్ట్రేలియన్' మాత్రం సున్నితమైన సమాచారాన్ని ప్రచురించలేదు. అయితే లీకైన డేటాలో అత్యంత రహస్యమైన స్టెల్త్ సామర్థ్య వివరాలు ఉన్నాయి.
జలాంతర్గామి.. ఎంత పౌనఃపున్యంలో నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది, ఎంత వేగంలో వెళ్లేటప్పుడు ఎంత స్థాయిలో శబ్దం చేస్తుంది.. ఎంతలోతులోకి వెళ్లగలదు.. పరిధి.. వంటి ఇతర సున్నిత వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. శత్రువుకు ఆచూకీ దొరకకుండా ఉండటానికి జలాంతర్గామిలోని ఏ ప్రదేశంలో ఉండి సురక్షితంగా మాట్లాడుకోవచ్చన్నదానికి సంబంధించిన వివరాలు కూడా ఇందులో పేర్కొనడం గమనార్హం.
స్కార్పీన్ అయస్కాంత, విద్యుదయస్కాంత, పరారుణ డేటా, ఈ జలాంతర్గాముల టోర్పీడో ప్రయోగ వ్యవస్థ, ఇతర పోరాట వ్యవస్థల వివరాలు కూడా ఉన్నాయి. ఈ లీకేజీకి ఎవరు పాల్పడ్డారన్నది వెల్లడి కాలేదు. డీసీఎన్ఎస్కు ఉపగుత్తేదారుగా వ్యవహరించిన ఫ్రాన్స్ నౌకాదళ మాజీ అధికారి.. 2011లో ఈ డేటాను సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు 'ది ఆస్ట్రేలియన్' పేర్కొంది.
కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ప్రాజెక్ట్లలో ఒకటైన స్కార్పీన్ సబ్మెరైన్స్ భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సబ్మెరైన్ల తయారీలో సాయమందిస్తున్న డీసీఎన్ఎస్ గ్రూప్.. అటు ఆస్ట్రేలియాతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఆ దేశంతో వారు 3800 కోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.
అయితే ఆస్ట్రేలియాలో ఈ రకమైన సబ్మెరైన్ తయారుచేస్తారా లేదా అన్నది మాత్రం తెలియలేదు. భారత్ తయారుచేసిన స్కార్పీన్ సబ్మెరైన్లలో మొదటిదైన ఐఎన్ఎస్ కల్వరిని ఈ ఏడాది మేలో విజయవంతంగా పరీక్షించారు. తొందర్లోనే అది నేవీ చేతికి వెళ్లనుంది.
మనోహర్ పారికర్ ఏం చెప్పారు
భారత్ తయారు చేయిస్తున్న స్కార్పియన్ సబ్మెరైన్స్కు సంబందించిన సమాచారం లీకైందని తన దృష్టికి రాత్రి 12గంటల ప్రాంతంలో వచ్చిందని రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. అయితే ఇది హ్యాకింగ్ కేసు అయి ఉండొచ్చని చెప్పారు. అసలు లీకైంది భారత జలాంతర్గాముల సమాచారామా? కాదా అనే విషయంలో తొలుతు గుర్తిస్తామని తెలిపారు. అయితే, 100శాతం సమాచారం లీకవలేదని తెలిపారు. కాగా లీక్ సంబంధించిన మూలాలు విదేశాల్లోనే ఉన్నాయని నావికా దళం అధికారులు పేర్కొంటున్నారు.