త్రిపురలో సీపీఎం,బీజేపీ ఘర్షణలు తారాస్థాయికి-పార్టీ కార్యాలయాలు దగ్ధం-పరస్పర దాడుల్లో 10 మందికి గాయాలు
ఈశాన్యం రాష్ట్రం త్రిపురలో బుధవారం(సెప్టెంబర్ 8) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికార బీజేపీ,ప్రతిపక్ష సీపీఎం మధ్య తలెత్తిన ఘర్షణలు హింసకు దారితీశాయి. ఇరువర్గాల పరస్పర దాడుల్లో 10 మంది గాయపడ్డారు.సీపీఎంకు చెందిన రెండు కార్యాలయాలు దగ్ధమయ్యాయి. ఆరు వాహనాలకు నిప్పంటించారు. ఈ హింసాత్మక పరిస్థితులకు మీరంటే మీరే కారణమని బీజేపీ,సీపీఎం నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.
త్రిపురలోని గోమతి,బిషాల్గర్,సెపహిజలా జిల్లాలతో పాటు హపబియా,మెలార్మత్ ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఉదయ్పూర్,బిషాల్గర్తో పాటు పలు ప్రాంతాల్లోని సీపీఎం కార్యాలయాలకు దుండగులు నిప్పంటించారు. సీపీఎం,బీజేపీలకు చెందిన నేతలు పలు ప్రాంతాల్లో బాహాబాహికి దిగగా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.కొన్నిచోట్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. సీపీఎం కార్యాలయాలకు నిప్పంటించింది బీజేపీ నేతలేనని సీపీఎం నేతలు ఆరోపించగా... దాడులకు తెగబడింది సీపీఎం నేతలేనని బీజేపీ నేతలు ఆరోపించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపుర రాజధాని అగర్తలాలో బీజేపీ కార్యకర్తలు బుధవారం(సెప్టెంబర్ 8) ర్యాలీ చేపట్టారు.మరోవైపు బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందని ఆరోపిస్తూ సీపీఎంకి చెందిన యువజన విభాగం డీవైఎఫ్ఐ నిరసన ప్రదర్శన చేపట్టింది. తమ నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారని డీవైఎఫ్ఐ ఆరోపించింది. ఆ సమయంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,ఘర్షణ చోటు చేసుకోగా.. ఇరువైపులా పలువురు గాయపడ్డారని పేర్కొంది. ఈ ఘటన తర్వాతే బీజేపీ కార్యకర్తలు సీపీఎం కార్యాలయాలను తగలబెట్టినట్లు సీపీఎం ఆరోపిస్తోంది.
'పూర్తి నష్టాన్ని ఇంకా అంచనా వేయాల్సి ఉంది. ఇప్పటివరకూ గుర్తించిన ప్రకారం... మూడు బైక్స్,మూడు కార్లు దగ్ధమయ్యాయి.బిషాల్గర్,హపానియా ప్రాంతాల్లోని సీపీఎం కార్యాలయాలు దగ్ధమయ్యాయి. ఉదయ్పూర్లోని సీపీఎం కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో మఫీజ్ మియా అనే యువకుడు గాయపడ్డారు. దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నాం.హింసాత్మక ఘటనలపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం.' అని అగర్తలాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
త్రిపుర లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ బిజన్ ధార్ మాట్లాడుతూ... బిషాల్గర్లోని మా పార్టీ కార్యాలయ గేటును బీజేపీ కార్యకర్తలు బుల్డోజర్తో కూల్చి, ఆపై కార్యాలయానికి నిప్పంటించినట్లు తెలిసింది. మా పార్టీ నాయకుడు పార్థా ప్రతీమ్ మజుందార్ ఇంటిని కూడా వారు ధ్వంసం చేశారు.' అని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు.
మరోవైపు బీజేపీ మాత్రం సీపీఎం ఆరోపణలను ఖండించింది. తమ పార్టీ కార్యకర్తలు ఎవరిపైనా దాడి చేయలేదని బీజేపీ అధికార ప్రతినిధి నవెందు భట్టాచార్య అన్నారు. సీపీఎం కార్యకర్తలే ఏడుగురు బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న హింసాత్మక పరిణామాలకు సీపీఎం నేతలే బాధ్యులని ఆరోపించారు. బీజేపీకి చెందిన మహిళా కార్యకర్తలపై సైతం సీపీఎం కార్యకర్తలు ఇటుకలతో దాడి చేశారని ఆరోపించారు.
అగర్తలాలోని ప్రతివాది కలం అనే దినపత్రిక కార్యాలయంపై కూడా దుండగులు దాడులకు పాల్పడ్డారు. కార్యాలయానికి నిప్పంటించారు. ఈ దాడిలో నలుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. ఇది కూడా బీజేపీ కార్యకర్తల పనే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Recommended Video
Violence & Hooliganism is so ingrained in the @BJP4Tripura govt. that today the fourth pillar of DEMOCRACY was BRUTALLY ATTACKED!
— Abhishek Banerjee (@abhishekaitc) September 8, 2021
We stand in solidarity with the media fraternity and remain committed in our fight towards REMOVING the #DuareGunda Model of @BjpBiplab from Tripura. pic.twitter.com/6t19n7tyHN