సీఎం Vs షాహీన్బాగ్ : ఢిల్లీలో విచిత్ర పరిస్థితి.. కరోనా కంటే అదే డేంజర్ అని..
ఓవైపు హడలెత్తిస్తోన్న కరోనా.. మరోవైపు ఏ వైరస్ వచ్చినా వెనక్కి తగ్గేది లేదంటున్న సీఏఏ ఆందోళనకారులు.. ఇదీ ఢిల్లీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా.. ఎక్కడా 50 మంది కంటే ఎక్కువమంది గుమిగూడరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కానీ షాహీన్బాగ్ ఆందోళనకారులు మాత్రం ఆంక్షలను పట్టించుకోవడం లేదు. సీఏఏని అమలుచేయడమంటే.. కేంద్రం తమ శవాలను దాటుకుని వెళ్లాల్సిందేనని గతంలో సవాల్ చేసిన షాహీన్బాగ్ ఆందోళనకారులు.. ఇప్పుడు కరోనా వైరస్ ఆంక్షలను కూడా సవాల్ చేస్తున్నారు.

అప్పుడు కేజ్రీవాల్ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్న ఆందోళనకారులు..
తమ ఉనికే ప్రశ్నార్థకమైపోతున్నప్పుడు చివరి వరకు పోరాడుతూనే ఉంటామని.. ఆ క్రమంలో ఎటువంటి ఆంక్షలను పట్టించుకోమని ఆందోళనకారులు చెబుతున్నారు. సీఏఏని కేంద్రం ఉపసంహరించుకుంటే తప్ప ఆందోళనలను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు,ఇటీవలి ఢిల్లీ అల్లర్లను గుర్తుచేస్తూ.. వాళ్లు తమ బిడ్డలను,తల్లులను చంపారని షాహీన్బాగ్ ఆందోళనల్లో పాల్గొంటున్న వృద్దుడు అస్మా ఖతున్ ఆరోపించారు. వాళ్లు ముస్లింలను చంపుతున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు తమవైపు 100 తుపాకులు ఎక్కుపెట్టినా తాము చనిపోమని ఆయన సవాల్ చేశారు.

కరోనా కంటే సీఏఏనే భయపెడుతోంది..
తాము కరోనా వైరస్కి భయపడపట్లేదని.. కానీ సీఏఏ అనే నల్ల చట్టానికి తాము భయపడుతున్నామని ఆందోళనల్లో పాల్గొన్న నూర్జహాన్ అనే మహిళ పేర్కొన్నారు. తమవాళ్ల నుంచి తమను ఎక్కడ వేరుచేస్తారోనని భయపడుతున్నామన్నారు. తమ వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు లేనప్పుడు తల్లుల నుంచి బిడ్డలు,భర్తల నుంచి భార్యలు వేరుచేయబడుతారేమోనని భయపడుతున్నామన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు అక్కడి ఆందోళనకారుల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది.

ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవన్న సీఎం
షాహీన్బాగ్లో గత మూడు నెలల నుంచి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మధ్యలో ఒకసారి చర్చల ద్వారా ఆందోళనలకు తెరదించాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ.. అవేవి సఫలం కాలేదు. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తితో అనివార్యంగా ఆందోళనకారులు ఆందోళన విరమించుకోక తప్పదని అంతా భావించారు. అటు ప్రభుత్వం కూడా కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. అది ఆందోళన కార్యక్రమమైనా.. మరేదైనా.. 50మందికి మంచి ఉండరాదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తే 123 ఏళ్ల పురాతన అంటువ్యాధుల చట్టం ప్రకారం వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.

తగ్గేది లేదంటున్న ఆందోళనకారులు
ఢిల్లీలో ఇప్పటివరకు 114 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై స్కూళ్లు,కాలేజీ,మాల్స్,థియేటర్స్ను మూసివేయించింది. బహిరంగ సభలు,సమావేశాలను రద్దు చేసింది. అయితే షాహీన్బాగ్ ఆందోళనకారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించకపోవడం షాహీన్బాగ్ ఆందోళనకారులపై ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు పంపిస్తున్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఆందోళనకారులు మాత్రం.. కరోనా కంటే సీఏఏతోనే తమకు ఎక్కువ ప్రమాదమని.. కాబట్టి తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications