Maharashtra Election Result 2019: పశ్చిమ మహారాష్ట్రలో పవర్ చూపించిన పవార్
న్యూఢిల్లీ: శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ )ఈ సారి మహారాష్ట్రలోని సీట్లపై సవారీ చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ మహారాష్ట్రలో శరద్ పవరా తన పవర్ను చాటుతున్నారు. పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతం ఎన్సీపీకి కొన్నేళ్లుగా కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. అయితే 2014లో అప్పటి మోడీ మానియా ముందు నిలవలేకపోయింది. కానీ ఈసారి మాత్రం తన ట్రెండ్ను కొనసాగిస్తోంది.
పశ్చిమ మహారాష్ట్రలో పవార్ పట్టు
288 స్థానాలున్న మహారాష్ట్రలో ఒక్క పశ్చిమ మహారాష్ట్రలో 66 స్థానాలున్నాయి. ఇందులో మెజార్టీ స్థానాల్లో ఎన్సీపీ దూసుకెళ్లింది. ఇక్కడ ఈ స్థాయిలో ఎన్సీపీ దూసుకెళుతోందంటే ఇందుకు కారణం ఒకే ఒక్కడు ఆయనే 79 ఏళ్ల కురవృద్ధుడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. బీజేపీ శివసేనలకు ఇక్కడ ఎన్సీపీ గట్టిపోటీ ఇచ్చిందంటే ఆ క్రెడిట్ శరద్ పవార్కు మాత్రమే దక్కుతుందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక తన మిత్రపక్షం కాంగ్రెస్తో పోలిస్తే ఎన్సీపీకే ఎక్కువ సీట్లు వచ్చేలా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. 1999 నుంచి రెండు పార్టీలు దాదాపు కలిసే మహారాష్ట్రలో పోటీచేస్తున్నాయి.
1999 నుంచి ఎన్సీపీ కంచుకోటగా పశ్చిమ మహారాష్ట్ర
ఇక సతారాకు జరిగిన లోక్సభ ఉపఎన్నికల్లో కూడా ఎన్సీపీ తన మార్క్ను కనబరుస్తోంది. బీజేపీకి చెందిన ఉదయన్రాజే భోస్లేపై ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్ ముందంజలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు భోసలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పశ్చిమ మహారాష్ట్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ రాజకీయపార్టీకైనా ఇది చాలా కీలకం. ఒకప్పుడు ఇది కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నప్పటికీ 1999లో పవార్ ఎన్సీపీ పెట్టాక ఈ పార్టీ వైపు మారింది. ఈ ప్రాంతంలో రాజకీయాల వరకు మరాఠీలు ఎక్కువగా డామినేట్ చేస్తారు. అయితే దంగర్ సామాజిక వర్గం కూడా ఎన్నికల క్యాల్కులేషన్స్ను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.
2014లో పట్టుకోల్పోయిన ఎన్సీపీ
2014లో ఎన్సీపీ కంచుకోట అయిన పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో ఆ పార్టీ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్సీపీలు కలిసి పోటీచేయలేదు. కానీ రెండు పార్టీలు కలిపి ఇక్కడ 28 స్థానాలు మాత్రమే గెలిచాయి. అయితే బీజేపీ ఇక్కడ 22 స్థానాలు గెలువగా.. శివసేన 12 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ రెండు పార్టీలు కూడా ఒంటరిగానే పోటీచేశాయి. ఇక ఈ ప్రాంతంపై ఎలాగైనా సరూ పట్టుసాధించాలని బీజేపీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్లు ప్రచారం చేశారు. కానీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ముందు వీరి పవర్ పనిచేయలేదని ట్రెండ్స్ను చూస్తే అర్థమవుతోంది.