మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం: ఉద్ధవ్ థాకరే- ఏక్నాథ్ షిండేల్లో..!!
మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. శివసేన పేరు, విల్లు-బాణం ఎన్నికల గుర్తును ఉద్ధవ్ థాకరే కోల్పోయారు. ఈ రెండింటినీ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది కేంద్ర ఎన్నికల కమిషన్.
న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. శివసేన పేరు, విల్లు-బాణం ఎన్నికల గుర్తును మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కోల్పోయారు. ఈ రెండింటినీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి దక్కింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. ఏక్నాథ్ షిండే వర్గమే.. అసలైన శివసేన పార్టీగా గుర్తించినట్లు వెల్లడించింది.
ప్రస్తుతం శివసేన రూపొందించుకున్న నిబంధనలు, ఆ పార్టీ అమలు చేస్తోన్న అంతర్గత రాజ్యాంగం అప్రజాస్వామికమని ఎన్నికల కమిషన్ అధికారులు వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గతంగా ఎలాంటి ఎన్నికలను కూడా శివసేన నిర్వహించలేదని పేర్కొన్నారు. అలాంటప్పుడు పార్టీ అగ్ర నాయకత్వం రూపొందించుకున్న నియమ నిబంధనలు, మార్గదర్శకాలేవీ పరిగణనలోకి తీసుకోలేమని అన్నారు.

దీనిపట్ల ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఉత్తర్వులు వెలువడతాయని తాము ముందే ఊహించామని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పై తమకు ఎలాంటి నమ్మకం లేదని ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన అధికార ప్రతినిధి ఆనంద్ దుబే అన్నారు.
ఎన్నికల గుర్తు కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉందని, అలాంటప్పుడు ఈసీ అధికారులు దీనిపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇది సబ్ జ్యుడీషియరీ పరిధిలోకి రాదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఇప్పటివరకు గుర్తు కేటాయింపుపై ఎలాంటి తుది నిర్ణయాన్ని తీసుకోలేదని గుర్తు చేశారు. బీజేపీ కార్యకర్తలుగా ఈసీ అధికారులు పని చేస్తోన్నారనేది ఈ ఉదంతంతో మరోసారి స్పష్టమైందని అన్నారు.












Click it and Unblock the Notifications