షాకింగ్: గర్భంనుండి బిడ్డను బయటకు తీసి ఆపై మళ్ళీ గర్భంలోనే పెట్టి కుట్లేసిన వైద్యుడు!!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు గర్భిణీలు నరకయాతన అనుభవిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల వైద్యులు తమ వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. నిర్లక్ష్య వైఖరితో ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన వైద్యులు, ఆపరేషన్ ను సరిగా నిర్వహించకపోవడంతో నలుగురు మహిళలు మృతి చెందారు. ఇక ఈ ఘటన మరిచిపోకముందే అస్సాం రాష్ట్రంలో ఓ ప్రభుత్వ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ మహిళ పరిస్థితి విషమంగా మారింది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే నవీ నమసూద్ర అనే ఏడు నెలల గర్భిణి స్త్రీ కడుపులో నొప్పి రావడంతో కరీంగంజ్ లోని గవర్నమెంట్ ఆసుపత్రి కి వెళ్ళింది. అక్కడ గైనకాలజిస్ట్ గా పనిచేస్తున్న ఆశిష్ కుమార్ విశ్వాసం అనే వైద్యుడు, ఆమెకు ఎందుకు కడుపునొప్పి వచ్చింది అన్నది గుర్తించకుండా, ప్రసవ నొప్పులుగా భావించి సరైన టెస్టులు నిర్వహించకుండా గర్భిణీ మహిళకు సిజేరియన్ నిర్వహించారు. ఇక పసికందును బయటకు తీసిన వైద్యుడు, పిండం పూర్తిగా అభివృద్ధి చెందలేదని గుర్తించారు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా ఆపై మళ్లీ పిండాన్ని పొట్టలోనే పెట్టి కుట్లు వేశారు. గర్భిణీ మహిళను ఇంటికి పంపించారు.

ఇక ఈ ఘటన జరిగిన పన్నెండు రోజుల తర్వాత సదరు గర్భిణీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న ఆమెను మళ్ళీ వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్ చేసిన నిర్వాకం బయటకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. సదరు వైద్యుడిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్లు దేవుళ్ళతో సమానం అని భావిస్తాం. మన ప్రాణాలను రక్షించే వారిగా డాక్టర్లను భావిస్తాం. కానీ చాలా చోట్ల వైద్యులు పోతే ప్రజల ప్రాణాలే కదా మాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. చాలా నిర్లక్ష్యంగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. ప్రాణం పోతే తిరిగి రాదన్న నిజాన్ని మరచి కొందరు వైద్యులు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications