షాకింగ్ : కోవిడ్తో తల్లి,సోదరుడి మృతి... మృతదేహాలతోనే ఇంట్లో రెండు రోజులు గడిపిన మహిళ...
కర్ణాటకలోని బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. కరోనాతో మృతి చెందిన తల్లి,సోదరుడి శవాలను ఇంట్లోనే పెట్టుకుని ఓ మహిళ రెండు రోజులు గడిపింది. ఆమె మానసిక వికలాంగురాలు కావడం... ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునే తల్లి,సోదరుడు చనిపోవడంతో ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆమె చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అదే ఇంటిపై అద్దెకు ఉండే ఓ యువకుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగింది...
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరిలో ఉన్న బీఈఎంఎల్ లే అవుట్లో ఓ కుటుంబం చాలా కాలంగా నివసిస్తోంది. సొంత భవనంలోనే కింది పోర్షన్లో ఉంటున్న ఆ కుటుంబం పై పోర్షన్స్ అద్దెకు ఇచ్చింది. ఆర్యాంబ(65),ఆమె కుమార్తె శ్రీలక్ష్మి(47)కుమారుడు హరీశ్(45) కలిసి కింది పోర్షన్లో ఉంటున్నారు. హరీశ్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా శ్రీలక్ష్మి మానసిక వికలాంగురాలు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. ఇదే క్రమంలో హరీశ్ ఈ నెల 25న కరోనా బారినపడ్డాడు.
తల్లి మృతి... 2 రోజులుగా శవం పక్కనే 18 నెలల చిన్నారి... కరోనా వేళ గుండెలను పిండే విషాదం...
ఇంటి నుంచి దుర్వాసన రావడంతో...
హరీశ్ కరోనా బారినపడినప్పటి నుంచి ముగ్గురు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పెద్దగా బయటకు రావట్లేదు. ఇదే క్రమంలో బుధవారం(మే 12) ఆ ఇంటి పై పోర్షన్లో ఉండే ప్రవీణ్ అనే వ్యక్తికి ఏదో దుర్వాసన రావడం గమనించాడు. కింద ఇంటి నుంచే ఆ వాసన వస్తుండటంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూశారు.
కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు...
అప్పుడే లోపలి నుంచి శ్రీలక్ష్మి(47) బయటకు వస్తుండటం పోలీసులు గమనించారు. ఆమె మానసిక స్థితి సరిగా లేదని వారికి అర్థమైంది. లోపలి గదిలో ఆర్యాంబ,హరీశ్ మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. బహుశా వారిద్దరూ రెండు రోజుల క్రితమే చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. హరీశ్కు కరోనా సోకడంతో... తల్లికి కూడా వైరస్ సంక్రమించి ఉంటుందని... ఇద్దరూ కరోనాతో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Recommended Video
మహారాష్ట్రలోనూ ఇదే తరహా ఘటన
కొద్దిరోజుల క్రితం మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్లోనూ ఇదే తరహా ఘటన వెలుగుచూసింది. తల్లి చనిపోవడంతో 18 నెలల ఆమె చంటి బిడ్డ రెండు రోజుల పాటు ఆమె శవం పక్కనే గడిపాడు. కరోనా నేపథ్యంలో ఆ ఇంటి వైపు ఎవరూ వెళ్లకపోవడం,ఆమె భర్త ఉపాధి రీత్యా వేరే రాష్ట్రంలో ఉండటంతో వారిని ఎవరూ పట్టించుకోలేదు. చివరకు ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్కి తరలించి.. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన బాలుడికి ఆహారం అందించారు.