కొత్త వివాదంలో ఐఎఎస్ రోహిణి సింధూరి- సింగర్ లక్కీ అలీ భూమి కబ్జా
బెంగళూరు: విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారంటూ గుర్తింపు పొందిన కర్ణాటక కేడర్కు చెందిన తెలుగు ఐఎఎస్ అధికారిణి రోహిణి సింధూరి సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఇదివరకు మైసూరు జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో తోటి ఐఎఎస్ అధికారిణి, సిటీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శిల్పా నాగ్తో వివాదం గతంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు మళ్లీ వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.

తరచూ వార్తల్లో..
జిల్లా కలెక్టర్ హోదాలో రోహిణి సింధూరి తనపై రోజూ ఒత్తిడి తీసుకొస్తున్నారని, దీన్ని భరించలేక ఏకంగా తన సర్వీసుకే రాజీనామా చేస్తున్నట్లు 2001లో శిల్పా నాగ్ ప్రకటించడం అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మైసూరు జిల్లా కలెక్టర్గా ఉన్న రోహిణి సింధూరిని బదిలీ చేయాల్సి వచ్చింది. దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించింది. శిల్పా నాగ్ రాజీనామాను తిరస్కరించింది.

ఎన్నో బదిలీలు..
2009 బ్యాచ్.. కర్ణాటక కేడర్కు చెందిన రోహిణి సింధూరి తెలుగు అధికారిణి. మొదట్లో తుమకూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా, మండ్య జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేశారు. అనంతరం హసన్, మైసూరు జిల్లాల కలెక్టర్గా ఉన్నారు. మైసూరులో ఉన్నప్పుడే వివాదాలు చుట్టుముట్టాయి. 2017లో ఆమె హసన్ జిల్లా కలెక్టర్గా నియమితులు అయ్యారు. 2018న ఆమెను కేఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్గా, 2019లో సిల్క్ బోర్డ్ కమిషనర్గా బదిలీ అయ్యారు. 2020లో మైసూరు జిల్లా కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎక్కువ రోజులు అక్కడ కొనసాగలేకపోయారు. ఆ మరుసటి ఏడాది దేవాదాయ శాఖకు బదిలీ అయ్యారు.

తాజాగా భూకబ్జా వివాదం..
తాజాగా భూకబ్జా వివాదం రోహిణి సింధూరిని చుట్టుముట్టింది. బాలీవుడ్ గాయకుడు లక్కీ అలీ ఈ ఆరోపణలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బెంగళూరు శివార్లల్లోని యలహంక కెంచనహళ్లిలో గల తన తన వ్యవసాయ భూమిని ల్యాండ్ మాఫియా ఆక్రమిస్తోందని లక్కీ అలీ ఆరోపించారు. 50 ఏళ్లుగా ఆ భూమిలో తన ఆధీనంలో ఉందని, ఇప్పుడు దాన్ని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తోన్నారని చెప్పారు.

రోహిణి సింధూరి సహకారం..
ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి సహాయంతో భూమిని ఆక్రమించుకోవడానికి సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ప్రయత్నిస్తోన్నాడని లక్కీ అలీ పేర్కొన్నారు. ప్రస్తుతం తాను దుబాయ్లో ఉంటోన్నానని, లేని సమయం చూసుకుని వ్యవసాయ భూమిని కబ్జా చేస్తోన్నారంటూ చెప్పారు. కబ్జాదారులకు రోహిణి సింధూరి భర్త సహకరిస్తున్నట్లు తనకు తెలిసిందని లక్కీ అలీ అన్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని వాపోయారు.

ఏసీపీకి ఫిర్యాదు చేసినా..
ఈ విషయాన్ని తాను ఏసీపీ దృష్టికి తీసుకెళ్లానని, కబ్జాదారులపై ఫిర్యాదు చేశామని లక్కీ అలీ చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదని పేర్కొన్నారు. తన కుటుంబం, పిల్లలు అక్కడే నివసిస్తోన్నారని, స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి సహాయం అందట్లేదని అన్నారు. ఆక్రమణదారులకు పోలీసులు మద్దతు ఇస్తోన్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. ఈ నెల 7వ తేదీన కోర్టు విచారణలో ఈ వ్యవసాయ భూమిని తమదిగా చూపించడానికి కావాల్సిన సాక్ష్యాధారాలను సేకరించినట్లు తెలిసిందని అన్నారు.












Click it and Unblock the Notifications