ఆరుగురు పోలీసులు రాజీనామా ..ముగ్గురు పోలీసులను ఉగ్రవాదులు హతమార్చినందుకేనా..?
జమ్మూ: జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లాలో ముగ్గురు పోలీసులను హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆరుగురు పోలీసులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇందులో ఎస్పీఓలు కానిస్టేబుల్లున్నారు. దక్షిణ కశ్మీర్కు చెందిన వీరిని ఉగ్రవాదులు చంపుతారనే భయంతో ముందుగానే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
షోపియన్ జిల్లా దంగంకు చెందిన కానిస్టేబుల్ ఇర్షద్ అహ్మద్ బాబా , షోపియన్ జిల్లా బతగంద్కు చెందిన ఎస్పీఓ తాజుల్లా హుస్సేన్ లోనె, కుల్గాంకు చెందిన ఎస్పీఓ షబ్బీర్ అహ్మద్ థోకర్, కుల్గాంకు చెందిన ఎస్పీఓ నవాజ్ అహ్మద్ లోనెలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నట్లు వీడియో రికార్డింగ్ ద్వారా తెలుపుతూ దాన్నే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు షోపియాన్కు చెందిన ఎస్పీఓ నసీర్ అహ్మద్ భట్, ఉమర్ బషీర్లు తమ రాజీనామా లేఖలను వాట్సాప్ ద్వారా పంపించారు.
ఇదిలా ఉంటే కేంద్ర హోంశాఖ మాత్రం ఆరుగురు పోలీసులు రాజీనామా చేయలేదని వెల్లడించింది. గతకొద్ది రోజుల క్రితమే ఉగ్రవాదులు పోలీసులు రాజీనామా చేయాల్సిందిగా హెచ్చరించారు. కానీ పోలీసులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ముగ్గురు పోలీసులను ఎత్తుకెళ్లి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనకు భయపడే ఆరుగురు పోలీసులు రాజీనామా చేసి ఉంటారనే వార్తలు జమ్మూలో ప్రచారంలోకి వచ్చాయి.
జమ్మూలో ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసి చంపేశారు
కిడ్నాప్నకు గురై ఆ తర్వాత చంపివేయబడ్డ పోలీసుల మృతదేహాలు లభ్యమయ్యాక ఆ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడపడుతున్నాయి. ఉగ్రవాదులు పోలీసులను కిడ్నాప్ చేసి తీసుకెళుతుండగా బతగండ్ గ్రామస్తులు వెంటపడి వారిని వదిలేయాల్సిందిగా ఉగ్రవాదులను కోరారని అయితే వారు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి గ్రామస్తులను భయపెట్టారని పోలీసులు వెల్లడించారు. నది ప్రాంతాన్ని దాటాక ముగ్గురు పోలీసులను కాల్చి చంపారని గ్రామస్తులు తెలిపారు.
ఈ ఘటనను జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఖండించారు. ముగ్గురు పోలీసులను హతమార్చిన ఘటనను అందరూ ఖండిస్తారని కాని చనిపోయిన వారి కుటుంబాలకు స్వాంతన లభించదని ఆమె పేర్కొన్నారు. కేంద్రం దించుతున్న అదనపు బలగాలు కూడా ఈ ఘటనలను ఆపలేకపోతున్నాయని మండిపడ్డ ముఫ్తీ.. ఈ ఘటనతో చర్చలు కూడా సాఫీగా జరగవని ఆమె ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు.