ఫ్లిప్కార్ట్కు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా?: నాగాలాండ్పై వివాదం, నెటిజన్లు ఆడుకున్నారు!
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వివాదంలో చిక్కుకుంది. తమ రాష్ట్రానికి డెలివరీ సౌకర్యం ఎందుకు కల్పించడం లేదని, తమకు ఇంకా దీని నుంచి స్వాతంత్ర్యం రాలేదా? తాము కూడా భారతదేశంలోనే ఉన్నామని నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన ఓ వినియోగదారుడు ఫ్లిప్కార్ట్కు తెలిపాడు.

భారతదేశం బయట డెలివరీ లేదంటూ..
ఇందుకు స్పందించిన ఫ్లిప్కార్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్.. తాము నాగాలాండ్కు వస్తువులను డెలివరీ చేయలేమని, ఎందుకంటే తాము భారతదేశం వెలుపల వస్తువులను పంపిణీ చేయడం లేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

నాగాలాండ్ భారతదేశంలోనే ఉందంటూ ఫ్లిప్కార్ట్పై నెటిజన్ల ఫైర్..
ఈ క్రమంలో ఫ్లిప్కార్ట్పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్ కంపెనీకి నాగాలాండ్ భారతదేశంలోనే ఉన్న విషయం కూడా తెలియదా? అని మండిపడ్డారు. ఫ్లిప్కార్ట్ ఫేస్బుక్ పేజీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నాగాలాండ్ రాష్ట్రంలో ఎందుకు డెలివరీ చేయరు? ఈశాన్య రాష్ట్రాలను ఎందుకు వేరుగా చూస్తున్నారని ప్రశ్నించారు.

పొరపాటైంది.. క్షమించండి అంటూ ఫ్లిప్కార్ట్
ఈ వివాదం దుమారంగా మారడంతో వెంటనే ఫ్లిప్కార్ట్ యాజమాన్యం అప్రమత్తమైంది. వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నించింది. తమ పొరపాటుకు చింతిస్తున్నామని, క్షమాపణలు కోరుతున్నామని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. తాము దేశ వ్యాప్తంగా వస్తువులను డెలివరీ చేస్తామని, ఇందులో నాగాలాండ్ రాష్ట్రంలోని ప్రాంతాలు కూడా ఉన్నాయని తెలిపింది. నాగాలాండ్ రాష్ట్రంలో కూడా డెలివరీ అందిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామని వెల్లడించింది.
పాఠశాల విద్యలో భౌగోళిక శాస్త్రం అందుకే..
దిమాపూర్ టుడే పేజీలో ఈ వ్యవహారానికి సంబంధించిన వ్యాఖ్యలు దర్శనమిచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో నెటిజన్లు భౌగోళిక శాస్త్రం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. పాఠశాల విద్యలో భౌగోళిక శాస్త్రం సరిగా నేర్చుకుంటే ఇలాంటి పొరపాట్లు జరగవని చురకలంటిస్తున్నారు. కాగా, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్తో అన్ని రకాల వస్తువులపై భారీ ఆఫర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 16-21 వరకు ఈ ఆఫర్లను అందిస్తోంది.












Click it and Unblock the Notifications