కమ్ముకొస్తున్న కరువు.. దేశాన్ని వణికిస్తున్న తాజా వాతావరణ నివేదిక!
దేశవ్యాప్తంగా రైతాంగాన్ని, ఆర్థిక రంగాన్ని నైరుతి రుతుపవనాల గమనం తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఈ ఏడాది (2026) ఆరంభంలో రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పటికీ, వాటి ముందడుగు మాత్రం చాలా బలహీనంగా సాగుతోంది. దీని ప్రభావం దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కనిపిస్తోందని '360 వన్ క్యాపిటల్ రీసెర్చ్' (360 ONE Capital Research) తన తాజా పరిశోధనా నివేదికలో హెచ్చరించింది.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఖరీఫ్ సాగు ఊసే లేకుండా పోయిందని, వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది. ఒకవేళ ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో పాటు ఆహార సంక్షోభం ఏర్పడి నిత్యావసరాల ధరలు చుక్కలు చూసే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది.
గణాంకాల్లో 'వర్షపాత లోటు'.. 66 శాతం జిల్లాల్లో కరువు ఛాయలు!
నివేదిక ప్రకారం జూన్ 17 నాటికి దేశవ్యాప్తంగా సగటున 74.3 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 46.2 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే ఏకంగా 38 శాతం వర్షపాత లోటు నెలకొంది. జూన్ 17తో ముగిసిన వారంలో సాధారణం కంటే 48 శాతం తక్కువ వర్షం పడింది.

భారతదేశంలోని మొత్తం 36 వాతావరణ సబ్ డివిజన్లలో 22 డివిజన్లు తీవ్ర వర్షపాత లోటును ఎదుర్కొంటున్నాయి. జిల్లా స్థాయి పరిశీలనలోకి వెళ్తే.. దేశంలోని సుమారు 66 శాతం జిల్లాల్లో అతి తక్కువ లేదా లోటు వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా మధ్య భారతదేశంలో 62 శాతం, తూర్పు భారతదేశంలో 44 శాతం మేర సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పత్తి, పప్పుధాన్యాల సాగు కుదేలు.. వరి ఒక్కటే సేఫ్!
రుతుపవనాల జాప్యం దేశవ్యాప్తంగా పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. జూన్ 12 నాటికి మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం 84.6 లక్షల హెక్టార్లుగా నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 3.9 శాతం తక్కువ.
- పప్పుధాన్యాలు & పత్తి: వర్షాలు లేకపోవడంతో పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం ఏకంగా 43.2 శాతం పడిపోయింది. అలాగే తెల్ల బంగారంగా పిలిచే పత్తి సాగు కూడా 28 శాతం మేర క్షీణించింది.
- వరి సాగు: అయితే, గత ఏడాది నమోదైన తక్కువ బేస్ కారణంగా వరి సాగు విస్తీర్ణం మాత్రం వార్షిక ప్రాతిపదికన 28.4 శాతం వృద్ధిని కనబర్చడం కొంత ఉపశమనం కలిగించే అంశం.
జలాశయాల్లో నీరు ఉంది.. కానీ జూలై, ఆగస్టు నెలే కీలకం!
ప్రస్తుతం వర్షాలు లేకపోయినా దేశంలోని ప్రధాన జలాశయాల్లో (డ్యామ్లలో) నీటి నిల్వలు మెరుగ్గా ఉండటం ఒక సానుకూల అంశం. జూన్ 11 నాటికి డ్యామ్లలో లైవ్ స్టోరేజ్ సామర్థ్యం 28.3 శాతంగా ఉంది. ఇది గత 10 ఏళ్ల సగటు నిల్వ కంటే 16 శాతం ఎక్కువ. అందువల్ల తక్షణ సాగునీటి అవసరాలకు ఈ నీరు ఒక బఫర్లా (రక్షణ కవచం) ఉపయోగపడనుంది.
కానీ, రాబోయే జూలై, ఆగస్టు నెలలు భారతదేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమని '360 వన్ క్యాపిటల్ రీసెర్చ్' తెలిపింది. ఎందుకంటే దేశానికి కావలసిన అత్యధిక వర్షపాతం ఈ రెండు నెలల్లోనే కురుస్తుంది. ఈ సమయంలో గనుక రుతుపవనాలు పుంజుకుంటే పంటలు కోలుకుంటాయని, లేనిపక్షంలో ఆహార ద్రవ్యోల్బణం (Food Inflation) పెరిగి, గ్రామీణ ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోతాయని నివేదిక హెచ్చరించింది. ప్రభుత్వం, నిపుణులు ఈ రుతుపవనాల గమనాన్ని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.














Click it and Unblock the Notifications