ఈసీ నజర్: ఆ పోస్టులను తొలగించిన సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో చుట్టేస్తున్న కొన్ని పోస్టులను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్, గూగుల్లకు సూచించడంతో మొత్తం 628 పోస్టులను తొలగించాయి. ఎన్నికల కోడ్ మార్చి 10వ తేదీ నుంచి అమలులోకి రావడంతో అప్పటి నుంచి కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చిన పోస్టులన్నిటీనీ ఈ సామాజిక మాధ్యమాలు తొలగించాయి.
ఇక 90శాతానికి పైగా పోస్టులు ఫేస్బుక్లో కనిపించాయని ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఈ పోస్టులు ఏ పార్టీ వారు పెట్టారు అన్న విషయాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చే 578 పోస్టులను ఫేస్బుక్ తొలగించగా... ట్విటర్ 49 పోస్టులు, వాట్సాప్, గూగుల్ చెరో మూడు పోస్టులను తొలగించాయి. ఇదిలా ఉంటే మార్చిలో ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీలు ఈసీతో కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చే పోస్టులను తొలగిస్తామని ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన పోస్టు ఏది కనిపించినా మూడుగంటల్లోనే దాన్ని తొలగిస్తామని తెలిపాయి. ఎన్నికలు సజావుగా ఒక పద్ధతి ప్రకారం జరగాలన్న ఉద్దేశంతోనే ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి సోషల్ మీడియా.
సోషల్ మీడియా నుంచి తొలగించిన 628 పోస్టుల్లో 477 పోస్టులు రాజకీయ పోస్టులు ఉండగా... మరో 37 పోస్టులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించేలా ఉండటంతో తొలగించాయి. ఫేస్బుక్లో పోస్ట్ అయిన 60 రాజకీయ ప్రకటనలను తీసివేసినట్లు సమాచారం. ఫేస్బుక్పై రాజకీయ పరమైన ప్రకటనల ఇచ్చేందుకు అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీగా బీజేపీ నిలిచింది.మార్చిలో రెండువారాల్లోనే బీజేపీ రూ.1.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా నాయకులు నేతలు చేసిన ప్రసంగాల్లో ఎక్కువగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ... ఈ కేటగిరీ కిందకు వచ్చే పోస్టులను కేవలం 11 మాత్రమే సోషల్ మీడియా దిగ్గజాలు తొలగించడం విశేషం.