కలకలం: తల్లి శవంపై కూర్చుని అఘోరా తాంత్రిక పూజలు
చెన్నై: తన తల్లి శవంపై కూర్చుని అఘోరా వేషాధారణలో కొడుకు చేసిన తాంత్రిక పూజలు తమిళనాడులో కలకలం రేపాయి. ఈ ఘటన తిరుచ్చి జిల్లా తిరువెరుంబూర్ సమీపంలోని అరియమంగళంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళితే.. అరియమంగళకు చెందిన మేరీ అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆమె అంత్యక్రియలు కుమారుడైన మణికంఠన్ నిర్వహించాడు. అయితే, మణికంఠన్ వారణాసిలో అఘోరాగా మారిపోయి.. అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంలో నిత్యపూజలు చేస్తున్నాడు.
మణికంఠన్ అఘోరా కావడంతో వారణాసిలోని తన మిత్రులను రప్పించి అంత్యక్రియలు తమ శైలిలో నిర్వహించాడు. ఇందులో భాగంగా మణికంఠన్ తన తల్లి మేరీ శవంపై కూర్చుని ప్రత్యేక పూజలు చేశాడు.
అనంతరం ఇతర అఘోరాలతో ఖననం చేశారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న గ్రామస్తులంతా ఇదంతా చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది.