రేపు తెలంగాణకి అమిత్ షా, మోడీపై సోనియా పావులు
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గురువారం హైదరాబాద్ వస్తున్నారు. బోయినపల్లిలోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
రానున్న రోజుల్లో అమిత్ షా తెలంగాణ రాష్ట్రం పైన ప్రత్యేక దృష్టి సారించనున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టనున్నారని అంటున్నారు.
మోడీ ప్రభుత్వం టార్గెట్గా సోనియా పావులు
నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకునేందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బుధవారం ఆమె మహిళా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా బిల్లుతో పాటు పలు పెండింగ్ బిల్లులతో కేంద్రాన్ని ఇరుకున పెట్టే యోచన చేస్తున్నారు.
అదే సమయంలో మోడీ ప్రభుత్వం యూపీఏ పథకాలనే కాపీ కొడుతున్నారని ఆమె విమర్శించారు. దేశ ప్రజలను మోడీ, బీజేపీ నేతలు తప్పుదారి పట్టించి అధికారంలోకి వచ్చారని, పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ దేశం కోసం కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో ఎంతో చేసినప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు.