సచిన్ 200వ టెస్ట్: ఆటగాళ్లకు ప్రత్యేక జెర్సీలు
ముంబై: వాంఖేడే స్టేడియంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరి టెస్టు ఆడుతున్న సందర్బంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేక జెర్సీలను రూపొందించింది. మాస్టర్ తన చివరిదైన 200వ టెస్టు సందర్భంగా అతన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ జెర్సీలపై బిసిసిఐ లోగో కింద ‘సచిన్ రమేష్ టెండూల్కర్ 200వ టెస్టు' అని ముద్రించింది.
ఇప్పటి వరకు ఇలాంటి గౌరవం లెజెండరీ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్తోపాటు మరే ఇతర క్రికెటర్కీ లభించకపోవడం గమనార్హం. గురువారం వెస్టిండీస్తో సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు మ్యాచ్ ప్రారంభమైన సందర్భంగా వ్యాఖ్యాతలు కూడా ‘ఎస్ఆర్టి 200' అని ముద్రించిన జాకెట్లను ధరించారు. ఈ జాకెట్లపై కామెంటేటర్ హర్షా బోగ్లే స్పందిస్తూ.. ‘గురువారం ఉదయం కొత్త జాకెట్లు వచ్చాయి. స్మార్ట్గా ఉన్నాయని భావిస్తున్నారా?' అని ట్వీట్ చేశారు.
ఈ మ్యాచు సందర్బంగా మరో విశేషం కూడా ఉంది. సచిన్ టెండూల్కర్ చిత్రంతో కూడిన ప్రత్యేక బంగారు నాణెంతో టాస్ వేశారు. టాస్కు ముందు బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ ప్రత్యేక నాణేన్ని టీమిండియా కెప్టెన్ ధోనీకి అందించాడు. టాస్ వేశాక ఆ నాణేన్ని మాస్టర్ సచిన్ టెండూల్కర్కు బహుమతిగా ఇచ్చారు. వెస్టిండీస్ జట్టు కెప్టెన్ డారెన్ సమి తమ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని సచిన్కు ప్రదానం చేశాడు.
సాధారణంగా నల్లరంగుతో కనిపించే మాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ గ్రిప్ ఈ మ్యాచు సందర్బంగా మూడు రంగుల్లో కనిపించింది. తన చివరి టెస్టు కావడంతో స్పాన్సర్ లోగో చుట్టూ.. గ్రిప్పై భారత జాతీయ పతాకంలోని మూడు రంగులను ముద్రించారు. సచిన్ తన క్రికెట్ జీవితాన్ని దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాడని, తన అంకిత భావానికి ఈ చిత్రమే నిదర్శనమని అడిడాస్ బ్రాండ్ డైరెక్టర్ తుషార్ పేర్కొన్నారు.