‘ఢిల్లీ తబ్లిఘి జమాత్’ వల్లే భారీగా పెరిగిన కరోనా కేసులు: రాష్ట్రాల వారీగా., తెలుగు రాష్ట్రాలే టాప్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిఘి జమాత్ వద్ద విదేశాలకు చెందిన, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లింలు గుమిగూడటం.. వారిలో కొందరికి కరోనా పాజిటివ్ ఉన్న కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగిందని భారత వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఈ ప్రార్థనలను ముగించుకుని చాలా మంది తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారని, వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్రాలను సూచించినట్లు పేర్కొంది.

1800 క్వారంటైన్లో.. రాష్ట్రాలకు ఆదేశాలు..
హోంమంత్రిత్వశాఖ అధికారులతో కలిసి కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ మీడియాతో బుధవారం మాట్లాడారు. కరోనా బాధితులతో సంప్రదింపులు జరిపి వారికి ఇంటెన్సివ్ డ్రైవ్లు నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు తెలిపారు. నిజాముద్దీన్ ప్రార్థనల్లో పాల్గొన్న 1800 మందిని ఇప్పటికే ఆస్పత్రులకు తరలించినట్లు ఆయన తెలిపారు. పలువురుని క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు.
లాక్ డౌన్ సూచనలను పాటించని కారణంగానే ఇలా జరిగిందని, ఇది జాతీయ దోరణిని సూచించదని అన్నారు.

యూపీలో కేసులు నమోదు..
కేరళ రాష్ట్రం నుంచి ఢిల్లీ తబ్లిఘి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న 60 మందిని ఆ రాష్ట్రంలో పర్యవేక్షణలో ఉంచారు. ఇక తబ్లిఘి జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది.
యూపీ నుంచి ఈ కార్యక్రమంలో 569 పాల్గొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, 218 మంది విదేశీయులు కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని తెలిపారు. అయితే, వీరికి ఢిల్లీ కార్యక్రమంతో సంబంధం ఉందా? అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి 71 మంది ఢిల్లీ నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు గుర్తించామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. వారిలో 54 మందిని క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు సీఎం మమతా వ్యాఖ్యానించారు.

యూపీ తర్వాత మహారాష్ట్రవారే ఎక్కువ
మహారాష్ట్రకు చెందిన 250 మంది ఢిల్లీ మత సమ్మేళనానికి హాజరైనట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. వీరితోపాటు మరో 50 మంది విదేశీయులను అహ్మద్ నగర్, థానేల్లో క్వారంటైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీకి వెళ్లినవారిలో పుణెతోపాటు మహారాష్ట్రలోని ఇతర జిల్లాలకు చెందినవారున్నారని తెలిపారు.
72 మంది విదేశీయులతో కలిపి హర్యానాకు చెందిన 503 మంది నిజాముద్దీన్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు గుర్తించినట్లు హర్యానా మంత్రి తెలిపారు. గుర్గావ్, అంబాల నుంచి వీరి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసులు గుర్తించారు. వారందరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇక రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 500 మందికిపైగా ముస్లింలు ఢిల్లీ మత సమ్మేళనంలో పాల్గొన్నారని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.

తెలుగు రాష్ట్రాలే టాప్..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1200 మంది వరకు ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొన్నారని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. వారిలో దాదాపు అందరినీ గుర్తించి క్వారంటైన్ చేసినట్లు తెలిపారు. మిగిలిన వారి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చినవారిలో ఇప్పటికే నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా 1085 మంది ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లారని, వారి వల్లే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణలో 97 పాజిటివ్ కేసులుండగా, ఏపీలో 87 కేసులు నమోదయ్యాయి. వీరిలో 70 పాజిటివ్ కేసులు కూడా ఢిల్లీ వెళ్లి వచ్చినవారివే కావడం గమనార్హం. కరోనాపాజిటివ్ ఉన్న విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ సమ్మేళనంలో పాల్గొనడం మిగితా వారికి కూడా వైరస్ సోకింది. వీరంతా వారి వారి రాష్ట్రాలకు వెళ్లడంతో వారి కుటుంబసభ్యులు, వారు కలిసిన వారికి కూడా కరోనా లక్షణాలు సోకినట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ మత సమ్మేళనానికి హాజరైన 18 మంది నేపాలీ ముస్లింలు తిరిగి ఆ దేశానికి వెళ్లడంతో అక్కడ వారిని ప్రభుత్వం క్వారంటైన్ చేసింది. మార్చి 1-15 వరకు ఈ సమ్మేళనం జరగడం గమనార్హం.
Recommended Video

24గంటల్లోనే 386 కేసులు..
గత 24 గంటల్లోనే 386 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐసోలేషన్ పడకల కోసం 5వేల రైల్వే కోచ్ లను ఆధునీకరించామని తెలిపారు. వీటిలో దాదాపు 3.2లక్షల ఐసోలేషన్ పడకలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 47వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 1637 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ఢిల్లీ ఘటన మినహా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ సమర్థవంతంగా అమలవుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా లాక్ డౌన్ పాటించాలని కోరారు. దేశ వ్యాప్తంగా21,486 శిబిరాల్లో 6.71లక్షల మందికి వసతి కల్పిస్తున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications