శ్రీరామ్ కృష్ణన్: ట్విటర్లో సమూల మార్పులకు ఎలాన్ మస్క్కు సహకరిస్తున్న ఈ భారతీయ ఇంజినీర్ ఎవరు?
- ట్విటర్ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేసే ప్రక్రియ పూర్తయింది
- ట్విటర్ నుంచి సీఈవో సహా పలువురు ఉన్నతోద్యోగులను మస్క్ తొలగించారు
- ట్విటర్ను 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్ 2022 ఏప్రిల్లో ఒప్పందం చేసుకున్నారు.
- ఆ తరువాత జులైలో ఆయన మనసు మార్చుకుని కొనుగోలు ఒప్పందం నుంచి బయటకు వెళ్లాలనుకుంటున్న చెప్పారు.
- ఆ తరువాత అక్టోబరులో మస్క్ మళ్లీ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించి టేకోవర్ పూర్తి చేశారు.
ట్విటర్ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ ఆ సంస్థలో సమూల మార్పులుకు తెర తీశారు.
భారత సంతతికి చెందిన పరాగ్ అగ్రవాల్ను సీఈవో పదవి నుంచి తొలగించారు ఎలాన్ మస్క్.
అదే ఎలాన్ మస్క్ ఇప్పుడు మరో భారతీయుడి సహాయంతో ట్విటర్లో సంస్కరణలకు తెరతీస్తున్నారు.
ప్రస్తుతం మస్క్కు సహకరిస్తున్న ఆ భారతీయుడి పేరు శ్రీరామ్ కృష్ణన్.
చెన్నైలో జన్మించిన ఈ ఇండియన్ అమెరికన్ ఇంజినీర్ ఇప్పుడు ఎలాన్ మస్క్ ప్రధాన టీంలో సభ్యుడు.
మస్క్కు సహకరిస్తున్న శ్రీరామ్ కృష్ణన్ తన ట్విటర్ అకౌంట్ వేదికగా వెల్లడించారు.
https://twitter.com/sriramk/status/1586815898039377920
శ్రీరామ్ కృష్ణన్ ఏం చెప్పారు
వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన శ్రీరామ్ కృష్ణన్ తాజాగా చేసిన ట్వీట్లో... తాను ట్విటర్ సంస్థ కోసం ఎలాన్ మస్క్కు సహకరిస్తున్నట్లు రాసుకొచ్చారు.
'మరికొందరు గొప్ప వ్యక్తులతో కలిసి నేను తాత్కాలికంగా ఎలాన్ మస్క్ కోసం పనిచేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన సంస్థ అని నేను నమ్ముతున్నాను. ప్రపంచంపై ట్విటర్ గొప్ప ప్రభావం చూపుతుంది. ఎలాన్ మస్క్ సారథ్యంలో అది జరగనుంది'' అని శ్రీరామ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
అయితే, తాను ట్విటర్ కోసం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని.. a16z సంస్థ కోసం తాను ప్రధానంగా పనిచేస్తుంటాననీ శ్రీరామ్ ట్విటర్ వేదికగా వెల్లడించారు.
శ్రీరామ్ పనిచేసే a16z ఒక ఇన్వెస్ట్మెంట్ సంస్థ. స్టార్టప్లు, ఇతర కంపెనీలు, క్రిప్టో సంస్థలలో a16z పెట్టుబడులు పెడుతుంది.
- అపర కుబేరులు.. సంపాదనలోనే కాదు ట్యాక్సులు ఎగ్గొట్టడంలోనూ ముందున్నారట
- పరాగ్ అగర్వాల్: సిలికాన్ వ్యాలీలో భారత సంతతి సీఈవోల ఆధిపత్యానికి కారణమేంటి?
శ్రీరామ్ కృష్ణన్ ఎవరు?
తాను పనిచేస్తున్న సంస్థగా శ్రీరామ్ కృష్ణన్ చెప్పిన a16z వెబ్సైట్లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఆయన a16zగా పిలిచే 'ఆండ్రీసెన్ హోరోవిజ్' సంస్థలో భాగస్వామి.
'ఆండ్రీసెన్ హోరోవిజ్' ద్వారా శ్రీరామ్ వివిధ కంజ్యూమర్ స్టార్టప్లలో పెట్టుబడులు పెడుతుంటారు. బిట్స్కీ, హోపిన్, పాలీవర్క్ వంటి సంస్థల బోర్డులలోనూ శ్రీరామ్ సభ్యుడు.
అయితే, a16zలో చేరడానికి ముందు శ్రీరామ్ ట్విటర్ సహా అనేక ప్రధాన సంస్థలలో పనిచేశారు.
ట్విటర్లో కంజ్యూమర్ టీమ్లను నడిపించిన శ్రీరామ్ ఆ సంస్థలో యూజర్ ఎక్స్పీరియన్స్, సెర్చ్, డిస్కవరీ, ఆడియన్స్ గ్రోత్ వంటి వ్యవహారాలను డీల్ చేశారు.
ఫేస్బుక్, స్నాప్చాట్లు సహా అనేక ఇతర సంస్థలకు ఆయన మొబైల్ యాడ్ ప్రొడక్ట్స్ కోసమూ పనిచేశారు.
నిజానికి శ్రీరామ్ కెరీర్ మైక్రోసాఫ్ట్తో మొదలైంది. మైక్రోసాఫ్ట్లో విండోస్ అజూర్ సహా అనేక ఇతర ప్రాజెక్టుల వ్యవహారాలను శ్రీరామ్ చూసేవారు.
చదువు చెన్నైలోనే..
శ్రీరామ్ కృష్ణన్ 2001-2005లో అన్నా యూనివర్సిటీ పరిథిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుకున్నారు.
2017 నుంచి 2019 వరకు ట్విటర్లో పనిచేశారు.
శ్రీరామ్ ట్విటర్ కోర్ కంజ్యూమర్ టీమ హెడ్గా ఉన్న కాలంలో కంపెనీ 20 శాతం వృద్ధి సాధించింది.
2013-2016 మధ్య శ్రీరామ్ మెటా(ఫేస్బుక్) కోసం పనిచేసినట్లు ఆయన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఉంది.
2005 నుంచి 2011 వరకు ఆయన మైక్రోసాఫ్ట్లో పనిచేశారు.
కంజ్యూమర్ టెక్నాలజీస్, క్రిప్టోకరెన్సీలతో పాటు స్టోరీ టెల్లింగ్లోనూ శ్రీరామ్కు ఆసక్తి ఎక్కువ.
- ఫేస్బుక్, ట్విటర్లకు పోటీగా ట్రంప్ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫాం 'ట్రూత్ సోషల్'
- ట్విటర్ ఆల్గారిథం తెల్లని ముఖాలు, అమ్మాయిల ముఖాల పట్ల పక్షపాతం చూపిస్తోందా?
తండ్రి ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి, అమ్మ గృహిణి
శ్రీరామ్ది చెన్నైలో మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశారు. అమ్మ గృహిణి.
శ్రీరామ్ భార్య పేరు ఆర్తి. 2002లో యాహూ మెసేంజర్ ద్వారా వీరికి పరిచయమైంది. అనంతరం వివాహం చేసుకున్నారు. 20 ఏళ్లుగా వీరి కాపురం సాగుతోంది.
21 ఏళ్ల వయసులో 2005లో శ్రీరామ్ అమెరికాలోని సీటెల్కు తరలిపోయారు. అక్కడ మైక్రోసాఫ్ట్లో ఆయన ఉద్యోగంలో చేరారు.
ఇప్పుడు ట్విటర్ సీఈవో ఎవరంటే..
పరాగ్ అగ్రవాల్ను సీఈవోగా తొలగించిన తరువాత ట్విటర్ సీఈవో ఎవరనే చర్చ మొదలైంది. అయితే, ఎలాన్ మస్కే కొత్త సీఈవో, డైరెక్టర్ అని ట్విటర్ వెల్లడించింది.
బోర్డ్లోని డైరెక్టర్లందరినీ మస్క్ తొలగించడంతో ప్రస్తుతం ఆయనొక్కరే సంస్థకు డైరెక్టరుగా ఉన్నట్లు.
ట్విటర్లో ఫీచర్లనూ మస్క్ మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
- రూ.18వేల కోట్ల కాంట్రాక్టు కోసమే కోమటిరెడ్డి బీజేపీలో చేరారా? కాంగ్రెస్, టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలేంటి, కోమటిరెడ్డి సమాధానమేంటి?
- మాస్టర్ ప్లాన్ మార్పుతో అమరావతి భవితవ్యం మారిపోతుందా? పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయా?
- టూ ఫింగర్ టెస్టు అంటే ఏంటి, దాన్ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేయాలని ఆదేశించింది?
- ఆంధ్రప్రదేశ్కు రాజధాని మాత్రమే కాదు, అవతరణ దినోత్సవమూ ఒక గందరగోళమేనా?
- ''నేను గర్భవతిని, వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)