గ్యాంగ్ రేప్కు బాధ్యురాలు నిర్భయేనని నిందితుడు: కాంగ్రెస్ ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో 2012 డిసెంబర్ నెలలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచారం ఘటన పైన.. నిందితుల్లో ఒకడైన ముఖేష్ స్టేట్మెంట్ పైన కాంగ్రెస్ పార్టీ మంగళవారం భగ్గుమంది. ఆ వ్యాఖ్యల ద్వారా అతని మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతోందని చెప్పింది.
'అతని మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతోంది. రాత్రి తొమ్మిది గంటల తర్వాత నిర్భయ బయటకు వెళ్లడాన్ని తప్పుపట్టడం ద్వారా అతను తన తప్పును న్యాయమైనదిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తాను చేసిన ఘోరం విషయంలో ఇప్పటికీ పశ్చాత్తాపపడటం లేద'ని కాంగ్రెస్ అధఇకార ప్రతినిధి శోభా ఓజా అన్నారు.
ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి వారిని వదిలే సమస్య లేదని.. వారిని కఠినంగా శిక్షించడం ద్వారా సమాజానికి చెప్పవలసి ఉందన్నారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్లో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణమైన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి జాతీయ మీడియాలో సోమవారం సంచలనాత్మకమైన వార్తాకథనం వచ్చిన విషయం తెలిసిందే. లైంగిక దాడికి యువకుడి కన్నా యువతే ప్రధాన కారణమని నిర్భయ కేసులో నిందితుడు అన్నట్లు వార్తలు వచ్చాయి. ముకేష్ సింగ్ అనే నిందిడుతుడిని బిబిసి డాక్యుమెంటరీ కోసం జైలులో ఇంటర్వ్యూ చేశారు.
అతని ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించి బ్రిటిష్ దిన పత్రిక ద టెలిగ్రాఫ్ వార్తాకథనాన్ని ప్రచురించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. పురుషులకు సంబంధించిన ముఠా ఆకర్షణకు గురి కావడం అనేది రాత్రి పూట బయటకు వచ్చే యువతులదే తప్పు అని అతను అన్నాడు.
ఆ రోజు బాధితురాలు గానీ ఆమె స్నేహితుడు గానీ ఎదుర్కోవడానికి ప్రయత్నించలేదని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ సామూహిక అత్యాచారం గురించి అతను మాట్లాడుతూ అది "ప్రమాదం" (అనుకోకుండా జరిగిన సంఘటన) మాత్రమేనని అన్నాడు.
ఆ ఇంటర్వ్యూను బిబిసి ఫోర్ స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రామ్ ఇండియాస్ డాటర్ పేరు మీద ఈ నెల 8వ తేదీన ప్రసారం చేయనుంది. వైద్య విద్యార్థిని తన మిత్రుడితో కలిసి సినిమా చూసిన తర్వాత ప్రైవేట్ బస్సు ఎక్కింది. మిత్రుడిని నిందితులు దారుణంగా కొట్టారు. ఆ తర్వాత బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం వారి ఇద్దరి నగ్న దేహాలను రోడ్డు పక్కన పడేశారు.
బాధితురాలు 13 రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి తుది శ్వాస విడిచింది. ఈ సంఘటనపై పెద్ద యెత్తున ఆందోళన చెలరేగింది. నిందితుల్లో ఒకతను నిరుడు మార్చిలో జైలులో మరణించాడు. మైనర్ బాలుడిని మూడేళ్ల పాటు డిటెన్షన్ హోమ్కు పంపించారు. ముకేష్ సింగ్తో పాటు నలుగురు నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించి వారికి నిరుడు మరణశిక్ష విధించింది.
నలుగురు దోషులు అపీల్ చేయడంతో సుప్రీంకోర్టు మరణశిక్షపై స్టే విధించింది. సంఘటన జరిగినప్పుడు 26 ఏళ్లు ఉన్న ముకేష్ సింగ్ బస్సు డ్రైవర్. సంఘటనతో తనకు సంబంధం లేదని అతను కోర్టుకు చెప్పుకున్నాడు. అయితే, అతని వాదనను కోర్టు తిరస్కరించింది. అతనికి వ్యతిరేకంగా డిఎన్ఎ పరీక్ష ఫలితం వచ్చిందని కోర్టు తెలిపింది.
ముకేష్ సింగ్ ఇంటర్వ్యూలో ఏ విధమైన పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఒక్క చేత్తో చప్పట్లు కొట్టలేమని, రెండు చేతులు కలవాల్సిందేనని అతను అన్నాడు. మర్యాదగల అమ్మాయి రాత్రి 9 గంటల తర్వాత వీధుల్లో తిరగదని అతను వ్యాఖ్యానించాడు. యువకుడి కన్నా యువతి అత్యాచారానికి ఎక్కువ బాధ్యురాలని అన్నాడు. అమాయి, అబ్బాయి ఎప్పుడూ సమానం కారని, అమ్మాయిలు ఇంటి పనులు, ఇంటి సంరక్షణ మాత్రమే చేయాలని అతను అన్నట్లు ద టిలిగ్రాఫ్ రాసింది.
రాత్రి వేళల్లో అమ్మాయిలు డిస్కోలకు, బార్లకు తిరగకూడదని, తప్పుడు పనులు చేయడం, తప్పుడు దుస్తులు ధరించడం అమ్మాయిలు చేయకూడదని అనతు అన్నాడు. దాదాపు 20 శాతం అమ్మాయిలు మాత్రమే మంచివారని అన్నాడు. తమకు మరణశిక్ష విధిస్తే అమ్మాయిల పరిస్థితి భవిష్యత్తులో మరింత దారుణంగా ఉంటుందని అన్నాడు.