క్లాస్ ఫస్ట్: తోటి విద్యార్థినుల టిఫిన్ బాక్సుల్లో విషం కలిపిన 3వ క్లాస్ విద్యార్థిని
ముంబై: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నవర్గావ్లోని కల్పతరు విద్యాలయంలో దారుణం జరిగింది. తోటి విద్యార్థినే తన స్నేహితురాళ్ల టిఫిన్ బాక్స్ల్లో విషం కలిపింది. ఆ విషాహారం తిన్న ఇద్దరు విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కల్పతరు విద్యాలయంలో దీక్షిక ఖోబ్రగడ్, సమృద్ధి కోలీ అనే ఇద్దరు విద్యార్థినులు మూడవ తరగతి చదువుతున్నారు. వీరే ఎప్పుడూ క్లాస్లో ఫస్ట్ వస్తున్నారు. వీరిద్దరూ ఫస్ట్ రావడంతో అసూయ చెందిన మరో విద్యార్థిని వీరి టిఫిన్ బాక్సుల్లో విషం కలిపింది. కాగా, విషం కలిపిన విద్యార్థిని మొదట్లో క్లాస్ ఫస్ట్ వచ్చేది. అయితే ఇప్పుడు రావడం లేదు.

ఇక్కడే దీక్షిక, సమృద్ధిపై ఆ విద్యార్థిని పగ పెంచుకుంది. ఈ క్రమంలోనే వారి టిఫిన్ బాక్స్ల్లో విషం కలిపింది. అదే ఆహారాన్ని మధ్యాహ్న భోజనంగా చేసిన ఇద్దరు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యాలయ టీచర్లు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులు విషం కలిపిన ఆహారం తీసుకున్నారని వైద్యులు తెలిపారు.
దీంతో టీచర్లు క్లాస్ రూమ్లో తనిఖీలు చేయగా ఓ విద్యార్థిని బ్యాగులో విషం బాటిల్ బయటపడింది. విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. ఒకరు చంద్రపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరు గడ్చిరోలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆ విషం బాటిల్ను, విద్యార్థినుల టిఫిన్ బాక్స్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.












Click it and Unblock the Notifications