ఏపీకి ప్యాకేజీ, హోదా వేర్వేరు: సుజన, ఆలస్యం: అశోక్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వేరు, ప్యాకేజీ వేరు అని కేంద్రమంత్రి సుజనా చౌదరి బుధవారం అన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ప్రత్యేక ప్యాకేజీ విషయమై ఏపీ మంత్రులు పలువురు భేటీ అయ్యారు. భేటీ అనంతరం సుజనా చౌదరి మాట్లాడారు. రాజధానికి ఎంత నిధులు అవసరమో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అంచనా వేయలేదని చెప్పారు. రాత్రికి రాత్రే పనులన్నీ పూర్తయ్యేందుకు ఇదేమీ పీసీ సర్కార్ మేజిక్ కాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, రాయితీల పైన 99 శాతం పని పూర్తయిందన్నారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో తాము మరోసారి భేటీ అవుతామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని అశోక గజపతి రాజు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో కొంత ఆలస్యమైందన్నారు.
అంతకుముందు నిర్మలతో భేటీ
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశం పైన చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్రమంత్రులు, ముఖ్య కార్యదర్శులు బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. నిర్మలతో కేంద్రమంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శులు భేటీ అయ్యారు. ఏపీ నుండి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ తదితరులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రమంత్రులు దీని పైన సమావేశమై చర్చిస్తున్నారు.
రాజధాని నిర్మాణానికి సహకరించాలని ఎన్నారైల పిలుపు
ఏపీ రాజధాని నిర్మాణానికి అందరు సహకరించాలని కాలిఫోర్నియాలోని ప్రీమాంట్లో ఎన్నారైలు విజ్ఞప్తి చేశారు. నూతన రాజధాని, నిర్మాణం, రైతుల సమస్యలు అనే అంశం పైన వారు చర్చించారు. రాజధాని నిర్మామానికి భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులను అభినందించారు.
మహేష్ శర్మకు గజపతిరాజు అభినందన
యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మంత్రి అశోక గజపతి రాజు బుధవారం మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సివిల్ ఏవియేషన్ మహేష్ శర్మకు పుష్పగుచ్ఛం అభినందనలు తెలిపారు. మహేష్ శర్మ బుధవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో బాధ్యతలను స్వీకరించారు.
జౌళీశాఖ మంత్రితో దత్తాత్రేయ
కేంద్ర జౌళీశాఖ మంత్రి సంతోష్ గంగ్వార్తో సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న 340 మంది రైతుల్లో పత్తి రైతులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.