పశ్చిమబెంగాల్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సుకాంత మజుందర్: జాతీయ ఉపాధ్యక్షుడిగా దిలీప్ ఘోష్
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమబెంగాల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ సుకాంత మజుందార్ నియామకమయ్యారు. తాజా మాజీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి కారణయ్యారంటూ ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
పశ్చిమబెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సుకాంత మజుందార్ను నియమించిన ఆ పార్టీ అధిష్టానం.. దిలీప్ ఘోష్ను పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ క్రమంలో దిలీప్ ఘోష్.. ట్విట్టర్ వేదికగా సుకాంత మజుందార్కు శుభాకాంక్షలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయాలని ఆకాంక్షించారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన చాలా మంది నాయకులు ఇప్పుడు అధికార టీఎంసీలోకి చేరుతుండటంతో బెంగాల్ పార్టీ అధ్యక్షుడిని మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచి టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా, బీజేపీ తరపున ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా పనిచేసి, ఆ తర్వాత మంత్రివర్గం విస్తరణలో స్థానం కోల్పోయిన అసాన్సోల్ ఎంపీ బాబూల్ సుప్రియో కూడా అధికార టీఎంసీలో చేరిపోయారు.
మరోవైపు ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్ బేబీ రాణి మౌర్యను పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రకటించింది బీజేపీ, దళిత నేత అయిన బేబీ రాణి మౌర్య త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, గత ఎన్నికలకు ముందు బీజేపీలోకి వెళ్లి ఈ మధ్యే తృణమూల్ కాంగ్రెస్లో చేరిన బాబుల్ సుప్రియో తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆకాశానికెత్తేశారు. ఆమె 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల ప్రధానమంత్రి అభ్యర్ధి రేసులో ముందున్నారని సుప్రియో వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ మమతా బెనర్జీపై ఎవరూ ఈ తరహా జోస్యం చెప్పలేదు. కానీ సుప్రియో మాత్రం ప్రధాని రేసులో మమత ఉన్నారని చెప్పడం ద్వారా ఈ చర్చ మొదలయ్యేలా చేశారని తెలుస్తోంది.
2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ కెప్టెన్ మమతా బెనర్జీ ప్రధాని కావాలని తాను కోరుకుంటున్నానని మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తన మనసులో మాట చెప్పేశారు. ప్రజాస్వామ్యంలో విపక్షం కీలక పాత్ర పోషిస్తుందని, వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్ధి రేసులో మమతా బెనర్జీ ఉన్నారన్న వాస్తవాన్ని అందరూ అంగీకరించాల్సిందేనని బాబుల్ సుప్రియో తెలిపారు. జూలైలో మోడీ కేబినెట్ ప్రక్షాళన సందర్భంగా కేంద్రమంత్రి పదవి కోల్పోయిన బాబుల్ సుప్రియో ఆ తర్వాత బీజేపీకి గుడ్ బై చెప్పారు. అదే సమయంలో రాజకీయాలకు సైతం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. కానీ మూడు రోజుల క్రితమే మనసు మార్చుకుని టీఎంసీలో చేరిపోయారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపొ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.ఇదంతా ఆయన రాజకీయ వ్యూహాల్లో భాగమేనని ప్రత్యర్ధులు చెప్తున్నారు. మరోవైపు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లాలో ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీకి దీటుగా నిలబడటంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విఫలమయ్యారని సంచలన వ్యాసం ప్రచురించిన నేపథ్యంలో బాబుల్ సుప్రియో వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో సుప్రియో వ్యాఖ్యలపై ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. సింగర్గా కొనసాగాలని బాబుల్ సుప్రియోకు మమతా బెనర్జీ సూచించారు.












Click it and Unblock the Notifications