మహిళల వేలం వేసే యాప్ క్రియేటర్ను ఇండోర్లో అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన బుల్లీ బాయ్ యాప్ తరహాలో మరో యాప్ సృష్టికర్తగా భావిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో నిందితుడ్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ యాప్నకు సంబంధించిన కేసులో ఇదే తొలి అరెస్టు అని తెలిపారు పోలీసు అధికారులు.
ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన వందలాది మంది మహిళల చిత్రాలను యాప్లో వేలానికి ఉంచి వారిని అల్లరిపాలు చేయడం, వారి ప్రతిష్టకు భంగం కలిగించడమే లక్ష్యంగా దీన్ని సృష్టించినట్లు అర్థమవుతోందన్నారు. బీసీఏ పూర్తి చేసిన నిందితుడు ట్విట్టర్లో ఈ యాప్నకు సంబంధించిన గ్రూప్ లో తానూ సభ్యుడిగా ఉన్నట్లు విచారణలో అంగీకరించాడని డీసీపీ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.
గిట్హబ్లో యాప్నకు సంబంధించిన కోడ్ ను తానే రూపొందించినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. ట్విట్టర్ గ్రూపులో ఉన్న అందరికీ దాన్ని అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఆ తర్వాత యాప్ ను కూడా ట్విట్టర్ లో షేర్ చేసినట్లు తెలిపారు. సోషల్ మీడియా నుంచి సేకరించిన మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి యాప్లో ఉంచేవాళ్లని పేర్కొన్నారు.
అయితే, ఈ వ్యవహారం గత ఏడాది వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అప్పుడే కేసు నమోదు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ యాప్ తరహాలోనే ఇటీవల బుల్లీ బాయ్ అనే యాప్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులను ముంబై, ఢిల్లీలో పోలీసులు పట్టుకున్నారు.
కాగా, బుల్లిబాయ్ యాప్ కేసులో ఆ యాప్ సృష్టికర్తను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయ్ ను ఢిల్లీ పోలీసులు అస్సాంలో పట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులు అరెస్టయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీరజ్ ఈ కేసులో ప్రధాన నిందితుడు. అతడు గిట్హబ్ ప్లాట్ ఫాంలో ఈ యాప్ రూపొందించినట్లు తెలిపాయి. అలాగే మహిళలకు సంబంధించిన అభ్యంతరకర చిత్రాలు అతడి ట్విట్టర్ ఖాతా నుంచే వచ్చినట్లు పేర్కొన్నాయి.
సోషల్ మీడియా నుంచి సేకరించిన కొందరు మహిళల ఫొటోలను మార్చిన దుండగులు బుల్లీబాయ్ యాప్లో ఉంచారు. వర్చువల్ వేలం కోసం వారి అనుమతి లేకుండానే ఫొటోలు ఆ యాప్లో అప్లోడ్ అవడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన మహిళల చిత్రాలను మాత్రమే ఉంచుతున్నట్లు తేలింది.
కాగా, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మయాంక్ రావల్(21), విశాల్ కుమార్ ఝా, మరో యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నిందితుల వాంగ్మూలాలున కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు.