మాండ్య నుంచి పోటీ చేస్తున్నా, చిరంజీవి ప్రశంసించారు: కాంగ్రెస్కు సుమలత షాక్
మాండ్య: ప్రముఖ నటి సుమలత కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. లోకసభ ఎన్నికల్లో తాను మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. సుమలత దివంగత కాంగ్రెస్ నేత, నటుడు అంబరీష్ సతీమణి. కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్ అభ్యర్థికి కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు.
మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని సుమలత ఇదివరకే చెప్పారు. సీటు జేడీఎస్కు కేటాయించడంతో తన నిర్ణయాన్ని 18వ తేదీన వెల్లడిస్తానని గతంలో ప్రకటించారు. ఈ రోజు (18వ తేదీన) ఆమె మాండ్య నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని చెప్పారు.
మాండ్య నుంచే పోటీ చేస్తానని చెప్పా
మాండ్య నియోజకవర్గంలో ప్రజలు తన పట్ల ఎంతో అభిమానం చూపిస్తున్నారని, అలాంటి వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని సుమలత చెప్పారు. కన్నడ సినీ పరిశ్రమ మొత్తం తన వెంటే ఉందని చెప్పారు. తన అభ్యర్థిత్వానికి అందరూ మద్దతిస్తున్నారని చెప్పారు. మాండ్య నుంచి తాను ఈ నెల 20వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. తనను బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్ నియోజకవర్గాల నుంచి పోటీ చేయమని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పాయని, కానీ తాను మాత్రం మాండ్య నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని చెప్పారు.
ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారు కానీ
తనకు ఎమ్మెల్సీ ఇస్తానని కాంగ్రెస్ చెప్పిందని, కానీ దానిని తాను తిరస్కరించానని సుమలత చెప్పారు. తాను మాండ్య ప్రజల కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. మాండ్య ప్రజలు తనను కోరుకుంటున్నారని చెప్పారు. తనకు అంతా మాండ్యనే అన్నారు. తాను పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని, ఓడిపోతాననే భయం తనకు లేదని చెప్పారు. పొత్తులో భాగంగా ఈ సీటు జేడీఎస్కు ఇచ్చారని, దీంతో తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.
చిరంజీవి, రజనీకాంత్ ప్రశంసించారు
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి వంటి వారు తమకు మంచి స్నేహితులు అని, వారు తన నిర్ణయాన్ని స్వాగతించారని సుమలత చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదని వారు ప్రశంసించారని తెలిపారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ.. పరిశ్రమ అంతా సుమలత వెంట ఉందని చెప్పారు. సుదీప్, పునీత్ రాజ్ కుమార్ వంటి వారు కూడా సుమలతకు అండగా ఉన్నారని చెప్పారు. యష్ మాట్లాడుతూ.. సుమలతను గెలిపించాలని కోరారు. సుమలత సినీ పరిశ్రమకు చెందిన వారు అని మాత్రమే తాము మద్దతివ్వడం లేదని, అంబరీష్కు తాము పిల్లల వంటివారమని, అందుకే అండగా నిలుస్తున్నామని దర్శన్ అన్నారు.
అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
గత వారం బీజేపీ సీనియర్ నేత ఎంఎస్ కృష్ణతో సుమలత భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అప్పుడు సుమలత మాట్లాడుతూ.. కుదిరితే బీజేపీ లేదంటే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. తుది నిర్ణయాన్ని 18వ తేదీన ప్రకటిస్తానని అన్నారు. మొత్తానికి తన నిర్ణయాన్ని ఇవాళ వెల్లడించారు. సుమలత భర్త అంబరీష్ గతేడాది నవంబర్ 24న మృతి చెందారు. అంబరీష్ మృతి అనంతరం కొద్ది రోజులకు ఆమె మాట్లాడుతూ తాను మాండ్య నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు జేడీఎస్కు వెళ్లింది. దీంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.