ముస్లింల కోసం రూ.లక్షలు వదులుకున్న హిందూ వ్యాపారి
ముంబై: ఓ వైపు దాద్రీ ఘటన వివాదాస్పదమవుతుండగా.. హిందూ, ముస్లింల మతసామరస్యానికి ముంబైకి చెందిన ఓ వ్యాపారి నిదర్శనంగా నిలిచాడు. ముంబైలోని ధారావికి చెందిన 53ఏళ్ల హిందూ వ్యాపారి, స్థానిక ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఖరీదైన తన షాపును అద్దె లేకుండా ఇచ్చాడు.
స్థానిక మసీదు పాతది కావడంతో కొత్తదానిని నిర్మించేందుకు ముస్లింలు నిర్మాణం చేపట్టారు. అయితే, అది పూర్తయ్యే వరకు నమాజ్ చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో.. స్థానిక తోళ్ల వ్యాపారి దిలీప్ కాలేను సంప్రదించారు.
మసీదు పక్కనే ఉన్న కాంప్లెక్స్లో కాలేకు 2,500చదరపు అడుగుల దుకాణం ఉంది. ఆ దుకాణం కిరాయికి ఇస్తే నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. అయితే, కాలే మాత్రం ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ దుకాణాన్ని నమాజు చేసుకునేందుకు ముస్లింలకు అప్పగించాడు.

పైగా ఫ్లోర్పై మార్బుల్ బండలు వేయడంతోపాటు, నల్లా వసతి కల్పించాడు. 40 ఏళ్లు కలిసిమెలిసి ఉంటున్నప్పుడు ఈ మాత్రం సాయం చేయకపోతే ఎలా అని కాలే పేర్కొనడం అతని పెద్ద మనసును తెలియజేస్తోంది. అంతేగాక, తాను చేస్తున్నది పెద్ద సాయం కూడా అనుకోవడం లేదని చెప్పాడు.
కాగా, హిందూ వ్యాపారి ఉదారతను స్థానిక ముస్లింలు కొనియాడారు. తాము అద్దె ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయన నిరాకరించారని చెప్పారు. లక్ష రూపాయల మేరకు అద్దె వచ్చే తన షాపును రూపాయి తీసుకోకుండానే ఇచ్చేశారని తెలిపారు.
ఏప్రిల్ నుంచి తాము ఆ షాపును అద్దె ఇవ్వకుండానే ఉపయోగించుకుంటున్నామని, మసీదు పూర్తయ్యే వరకు ఉపయోగించుకుంటామని తెలిపారు. కాలే అద్దె తీసుకోవడం వల్ల మసీదు నిర్మాణానికి మరో రూ. 8లక్షలు అదనంగా సమకూరినట్లయిందని తెలిపారు.












Click it and Unblock the Notifications