తాలిబన్లకు మద్దతు: 14 మంది అరెస్ట్, వీరిలో ఎంబీబీఎస్ విద్యార్థితోపాటు ముగ్గురు ఇస్లామిక్ క్లరిక్స్
గౌహతి: తాలిబన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న 14 మందిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఎంబీబీఎస్ విద్యార్థి కూడా ఉండటం గమనార్హం. కామరూప్, డర్రంగ్, బర్పేట, ధుబ్రి, హేలకండి, కచర్, కరీంగంజ్, సౌత్ సల్మారా, గోల్పారా, హోజాయి జిల్లాల నుంచి వీరిని అరెస్ట్ చేశారు.
నిందితులంతా తాలిబన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అంతేగాక, చట్టవ్యతిరేక కర్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. సమాచార హక్కు చట్టం, సీఆర్పీసీకి వ్యతిరేకంగా వారి కార్యకలాపాలున్నాయని చెప్పారు. శుక్రవారం రాత్రి నుంచి వీరిని అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు.

అరెస్టులను స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ ధృవీకరించారు. అరెస్టైన వారిలో ఓ ఎంబీబీఎస్ విద్యార్థితోపాటు ముగ్గురు ఇస్లామిక్ క్లరిక్స్ ఉన్నారని చెప్పారు.
తాలిబన్లకు మద్దతుగా ఎలాంటి వ్యాఖ్యలు, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బరౌహ్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులను గుర్తిస్తే తమకు తెలియజేయాలని పౌరులను కోరారు.
ఇది ఇలావుండగా, మొహర్రం వేడుకల్లో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు చేసిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో చోటు చేసుకుంది. మొహర్రం వేడుకల్లో పాకిస్థాన్ నినాదాలు చేసిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
కరోనా నిబంధనలను, మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఉజ్జయినీలోని గీతా కాలనీ వద్ద మొహర్రం ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ ర్యాలీలో పాల్గొన్న కొందరు నినాదాలు చేశారు. గురువారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
జాఫర్, అనీస్, అబ్దుల్, అజీజ్ తోపాటు పలువురు పాకిస్థాన్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వీడియోలను పోలీసులు పరిశీలించారు. ఆ తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఉజ్జయిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) సతేంద్ర కుమార్ శుక్లా మాట్లాడుతూ.. వీడియో ఆధారంగా పది మందిని గుర్తించామని తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారందరినీ విచారిస్తున్నామన్నారు. మిగితా నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
త్వరలోనే నిందులందర్నీ పట్టుకుంటామని ఎస్పీ సతేంద్ర కుమార్ తెలిపారు. ఇందు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులంతా 20-25 ఏళ్ల వయస్కులేనని చెప్పారు.
దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం.. ఎస్పీ అమరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్కు మద్దతుగా నినాదాలు చేసిన ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నిందితులపై 124ఏ, 153బీ, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.
పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రంగా స్పందించారు. తాలిబన్ సంస్కృతిని ఈ దేశం సహించబోదని హెచ్చరించారు. దేశ భక్తులైన భారతీయులకే ఇక్కడ చోటుందని, తాలిబన్ మనస్తత్వానికి మద్దతు ఇచ్చేవారు లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications