ఈడీ బాస్ మనోడే అనుకుంటే ఎలా?: కేంద్రంపై సుప్రీంకోర్టు ఫైర్- నోటీసులు జారీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యకలాపాలు విస్తృతంగా పెరిగాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈడీ సోదాలు, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం సహా పలు ఆర్థిక నేరాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తోన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అరెస్టులు నమోదయ్యాయి. రాజకీయంగా పెను ప్రకంపనలకు దారి తీస్తోందీ అంశం.

నేషనల్ హెరాల్డ్ కేసులో..
ఇదివరకు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ అధికారులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీని సైతం విచారించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతం తీవ్ర దుమారానికి దారి తీసింది. ఆ తరువాత కూడా ఈడీ దాడులు అధికం అయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న పలువురి ఆస్తులు, అకౌంట్లను ఈడీ అటాచ్ చేసింది.

రాజకీయ జోక్యం..
దేశవ్యాప్తంగా ఆర్థిక నేరాలు, మనీలాండరింగ్ వంటి అంశాలపై దర్యాప్తు చేపట్టడానికి ఏర్పాటైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో రాజకీయ జోక్యం తీవ్రతరమైందనే ఆరోపణలు ముందు నుంచీ వినిపిస్తోనే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకులపై మాత్రమే కక్షసాధింపు చర్యలకు పాల్పడటానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ అధికారులను ఒక అస్త్రంగా ప్రయోగిస్తోందని, ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనే ఆరోపణలూ లేకపోలేదు.

ఈడీ పదవీ కాలం పొడిగింపుపై..
ఈ పరిణామాల మధ్య కేంద్ర ప్రభుత్వం- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని మూడోసారి కూడా పొడిగించడం వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ- మూడుసార్లు దాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ అంశం సుప్రీంకోర్టు సైతం చేరింది. సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించడాన్ని సవాల్ చేస్తూ రిట్ పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి.

విచారణకు పిటీషన్..
దీన్ని విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్ నాథ్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. డాక్టర్ జయా ఠాకూర్ ఈ రిట్ పీటీషన్ను దాఖలు చేశారు. 2021 సెప్టెంబర్ 8వ తేదీన కామన్ కాజ్ కింద దాఖలు చేసిన రిట్ పిటీషన్ ఇది. ఈడీ డైరెక్టర్గా ఉన్న సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం 2021 నవంబర్ 16వ తేదీన ముగియాల్సి ఉన్నందున తదుపరి పొడిగింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు సూచించింది.

ఆర్డినెన్స్ స్థానంలో..
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2021 నవంబర్ 17 నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈడీ డైరెక్టర్ పదవీకాలాన్ని అయిదు సంవత్సరాల వరకు పొడిగించడానికి వీలుగా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టాన్ని సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ను ప్రకటించిందని గుర్తు చేశారు. ఆర్డినెన్స్ స్థానంలో డిసెంబర్ 2021న చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

ప్రయోజనాలను కల్పించడానికే..
సంజయ్ కుమార్ మిశ్రాకు ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ తీసుకొచ్చిందని పిటీషనర్ తరఫు న్యాయవాది వాదించారు. 2020 మే నెలలో 60 ఏళ్లు నిండిన తర్వాత మిశ్రా పదవీ విరమణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. 2018 నవంబర్లో తొలిసారిగా ఆయన ఈడీ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారని, అదే ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం- మూడుసార్లు పొడిగించిందని గుర్తు చేశారు. వాదనలను విన్న తరువాత సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు నోటీసులు పంపించింది.












Click it and Unblock the Notifications