The Kerala Story : బెంగాల్, తమిళనాడులో నిషేధంపై సుప్రీం కీలక ఉత్తర్వులు..
కేరళలో మతం మార్చుకుని ఐసిస్ లో చేరిన ముగ్గురు మహిళల కథ ఆధారంగా రూపొందించిన ది కేరళ స్టోరీ చిత్రంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఈ చిత్రం విడుదలపై నేరుగా నిషేధం విధించింది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా ఎగ్జిబిటర్లపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఈ రెండు ప్రభుత్వాల తీరుు సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలిచ్చింది.
కేరళ స్టోరీ చిత్రం ప్రదర్శనపై నిషేధం విధిస్తూ పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇది సమర్ధనీయం కాదని తెలిపింది. చిత్రం విడుదలపై బెంగాల్ సర్కార్ విధించిన నిషేధంపై స్టే ఇచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో ది కేరళ స్టోరీ ప్రదర్శనకు మార్గం సుగమమైంది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతి పొందిన కేరళ స్టోరీ చిత్రం ప్రదర్శన సందర్భంగా తలెత్తే శాంతి భద్రతల పరిస్ధితుల్ని నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. శాంతి భద్రతల్ని కారణంగా చూపుతూ చిత్రాన్ని నిషేధించడం సరికాదని తెలిపింది. చెత్త చిత్రమైతే బాక్సాఫీస్ వద్ద ఎలాగో ఫెయిలవుతుందంటూ వ్యాఖ్యానించింది.

అలాగే తమిళనాడు ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. తమిళనాడులో ఈ చిత్రం చూడాలని భావించే వారికి తగు రక్షణ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. సినిమా ప్రదర్శనకు కూడా తగు భద్రత ఏర్పాటు చేయాలని సూచించింది. విచారణ సందర్భంగా తమిళనాడులో కలెక్షన్లు లేక కేరళ స్టోరీ చిత్రాన్ని థియేటర్లే ఎత్తేశాయని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.












Click it and Unblock the Notifications