మేజిస్ట్రేట్కు అంత ధైర్యం ఎక్కడిది? సీజేఐ సీరియస్ వార్నింగ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో జరిగిన 36 రోజుల ఆందోళనలో పాల్గొన్నందుకు ఒక విద్యార్థికి ఏకంగా రూ. 5 లక్షల పర్సనల్ బాండ్ సమర్పించాలని నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు అత్యంత తీవ్రంగా స్పందించింది. సీజేపీ నిరసనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపైనా ఎలాంటి బలవంతపు లేదా కఠిన చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, గ్రేటర్ నోయిడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసు ఎలా ఇస్తారని నిలదీసింది. "సర్వోన్నత న్యాయస్థాన ఆదేశాలను ధిక్కరిస్తూ ఒక మేజిస్ట్రేట్కు అంత ధైర్యం ఎక్కడిది?" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి చెందిన అక్షత్ త్రిపాఠి అనే విద్యార్థి జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొనడమే కాకుండా, ఇతర విద్యార్థులను కూడా ప్రోత్సహించాడంటూ పోలీసులు ఆరోపించారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న సదరు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విద్యార్థికి రూ. 5 లక్షల బాండ్ నోటీసు జారీ చేశారు. అయితే విద్యార్థులపై గతంలో నమోదైన కేసులను తాము ఇప్పటికే రద్దు చేశామని, వారిపై ఎలాంటి చట్టపరమైన లేదా శిక్షార్హమైన చర్యలు తీసుకోకూడదని తేల్చిచెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సీనియర్ అడ్వకేట్ బిశ్వజిత్ భట్టాచార్య కోర్టు దృష్టికి తీసుకురాగా, గౌతమ్ బుద్ధ నగర్ డిస్ట్రిక్ట్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను సమగ్ర వివరణ కోరతామని సీజేఐ స్పష్టం చేశారు.

బ్యూరోక్రసీ పరిమితులు దాటితే వ్యవస్థకే ప్రమాదం!
మరోవైపు, అంతకుముందు రోజు అలహాబాద్ హైకోర్టు సైతం గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని, కార్యకర్త ఆకృతి చౌదరిపై ఏకంగా జాతీయ భద్రతా చట్టం ప్రయోగించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు తమకు ఉన్న పరిమితులను దాటి ప్రవర్తిస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఉన్న బాధ్యతలను విస్మరించకూడదని హెచ్చరించింది. అధికారుల విధేయత కేవలం రాజ్యాంగానికి మాత్రమే అయి ఉండాలని, రాజకీయ నాయకులకు కాదని స్పష్టం చేసింది.
రాజ్యాంగ హక్కుల పరిరక్షణే అధికారుల బాధ్యత!
పౌరుల రాజ్యాంగ హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే అధికారులకు చట్టబద్ధమైన అధికారాలు కట్టబెట్టారని, వాటిని ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించాలని అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల వరుస హెచ్చరికలతో, నిరసన తెలిపే పౌరులపై అక్రమ కేసులు బనాయించే అధికారులకు గట్టి సందేశం వెళ్లినట్లయింది. నోటీసు వెనక్కి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ, ఈ ధిక్కరణపై మేజిస్ట్రేట్ ఇచ్చిన వివరణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు సూచించింది.














Click it and Unblock the Notifications
