కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు నుంచి బిగ్ రిలీఫ్.. సీజేఐ బెంచ్ స్వయంగా..!!
దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా జరగనున్న బ్రిక్స్ సమ్మిట్ ను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరగకుండా ముందస్తుగా నిలువరించాలంటూ దాఖలైన పిటీషన్ పై విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కాక్రోచ్ జనతా పార్టీ లేదా ఏ ఇతర సంఘాలు, అసోసియేషన్లు ఎలాంటి ఆందోళనలు చేపట్టాలనుకున్నా వాటన్నింటినీ వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్ను పక్కనబెట్టింది.
దేశ రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ అనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తన తుది నిర్ణయాన్ని వెల్లడించింది. ఇదివరకు కాక్రోచ్ జనత పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలు, అనంతరం తలెత్తిన భద్రతాపరమైన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించిన విషయాన్ని గుర్తు చేసింది.

పిటిషనర్ వ్యక్తంచేసిన ఆందోళనలను, శాంతిభద్రతల సమస్యలను నేరుగా ఆ నిపుణుల కమిటీ ముందే ఉంచి సరైన పరిష్కారాన్ని కనుగొనాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ వివాదాస్పద వ్యవహారంలో న్యాయస్థానం స్వయంగా నేరుగా జోక్యం చేసుకోవడం కంటే నిర్ణీత వ్యవస్థల ద్వారా పరిష్కారం కనుగొనడం సరైన పద్ధతి అని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది. తాము ఏర్పాటు చేసిన కమిటీ తన విధులను సమర్థవంతంగా, నిష్పాక్షికంగా నిర్వహిస్తుందని విశ్వసిస్తున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు.
ప్రతిపాదిత నిరసన ప్రదర్శనల సమయంలో భారీ ఎత్తున అల్లర్లు గాపీ, హింస గానీ చెలరేగే అవకాశం ఉందన్న పిటిషనర్ అంచనాలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఢిల్లీలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని ముందే భావించడానికి ఎలాంటి తగిన ఆధారాలు లేవని సీజేఐ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత మార్గంలో నిరసనలు తెలియజేసే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొంది.
దేశంలో నిరసనల వైఖరిపై సుప్రీంకోర్టు సానుకూల దృక్పథాన్ని వ్యక్తపరిచింది. ఈ ఆందోళనల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ శాంతియుతమైన మార్గంలోనే తమ నిరసనను వ్యక్తం చేస్తారని, చట్ట పరిధిలోనే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని తాము భావిస్తున్నట్లు తెలిపింది. ముందస్తు అపోహలతో ఏదో ఒక అపశ్రుతి జరుగుతుందని ఇప్పుడే ఊహించడం ఎంతమాత్రం సరికాదని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
నిరసనలలో పాల్గొంటున్న నిర్దిష్ట సంస్థలను లేదా వాటి నిర్వాహకులను వ్యక్తిగతంగా కోర్టు ముందుకు పిలిపించి సమన్లు జారీ చేయాలన్న పిటిషనర్ ప్రతిపాదనను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. తాము నేరుగా ఏ ఒక్క గ్రూపును పిలిపించి మాట్లాడలేమని స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్యలపై ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించడం సముచితమని కోర్టు వ్యాఖ్యానించింది. బ్రిక్స్ సమ్మిట్ సమయంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపైనే ఉంటుందని తేల్చి చెప్పింది.














Click it and Unblock the Notifications