టీమిండియా గట్టి ఎదురుదెబ్బ: బౌలర్ అవుట్
భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టీ20 సిరీస్ నంచి స్టార్ బౌలర్ వైదొలిగాడు. మొదటి మ్యాచ్ లో ఆడిన ఈ బౌలర్.. ఇక మిగిలిన రెండు మ్యాచ్ ల నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. నేడు ఆఫ్ఘనిస్తాన్ తో రెండో టీ20 మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకుంది. పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన 24 గంటల లోపే అతను జట్టుకు దూరం కావాల్సి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడ్డ వరుణ్ చక్రవర్తి.. సుదీర్ఘ విరామం, రిహాబిలిటేషన్ తర్వాతే ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కుఎంపికయ్యాడు. ఆదివారం ఢిల్లీలో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఆడాడు కూడా. పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన నాలుగో ఓవర్ల కోటాలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. మ్యాచ్ కొనసాగుతున్నప్పుడే సైడ్ స్ట్రెయిన్ తో ఇబ్బంది పడ్డాడు. అది మరింత తీవ్రం కావడంతో మిగిలిన రెండు మ్యాచ్లకూ దూరం కావాల్సి వచ్చింది.

గాయం తీవ్రత దృష్ట్యా వరుణ్ చక్రవర్తి తక్షణమే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రిహాబిలిటేషన్ కు వెళ్లనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేంత వరకూ అక్కడి ఫిజియో, డాక్టర్ల పర్యవేక్షణలో కొనసాగనున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే వారం చైనాలో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ నాటికి వరుణ్ చక్రవర్తి పూర్తి ఫిట్నెస్ సాధించడం అనుమానమే. అప్పటికి జట్టుకు అందుబాటులోకి వస్తాడా లేదా అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
అతని గాయం నేపథ్యంలో రెండో మ్యాచ్కు ముందు కొన్ని తుదిజట్టులో కొన్ని సర్దుబాట్లు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయిదో బౌలర్ స్థానాన్ని భర్తీ చేయడం, అతనిని ఉపయోగించుకునే విధానంపై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. గాయం కారణంగా జట్టుకు దూరమై ఇటీవలే పునరాగమనం చేసిన నితీష్ కుమార్ రెడ్డి ఇంకా గాడిన పడట్లేదు. బౌలింగ్ పై అంతగా పట్టు చిక్కలేదతనికి. చివరి ఓవర్ వేసిన శివమ్ దూబే ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం కూడా జట్టు ఆందోళనను పెంచే విషయమే.
ఓపెనింగ్ స్థానంపై సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్తోనే ఇన్నింగ్స్ ప్రారంభించాలా లేక యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇస్తారా అనేది తేలాల్సి ఉంది. గత మ్యాచ్లో లభించిన అవకాశాన్ని సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. షార్ట్ పిచ్ బంతిని ఆడబోయి స్క్వేర్ లెగ్ వద్ద క్యాచ్ ఇచ్చి 10 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇది.. అతని స్థానానికి ఎసరుపెట్టింది.
ఆఫ్ఘనిస్తాన్ పై నేడు జరిగే రెండో టీ20లో.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కేప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్/యశ్ ఠాకూర్, జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ కు చోటు దక్కొచ్చు.













Click it and Unblock the Notifications
