సీజేఐ ఎన్వీ రమణ విచారణలు ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు: లింక్ ఇదే: సుప్రీం చరిత్రలో తొలిసారి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఇవ్వాళ పదవీ విరమణ చేయబోతోన్నారు. 2014 ఫిబ్రవరి 17వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత ఏడాది ఏప్రిల్ 24వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. అయన కంటే ముందు సీజేఐగా పని చేసిన శరద్ అరవింద్ బాబ్డే నుంచి బాధ్యతలను స్వీకరించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి 48వ చీఫ్ జస్టిస్గా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.
ఎన్వీ రమణ తరువాత చీఫ్ జస్టిస్గా ఉదయ్ ఉమేష్ లలిత్ నియమితులు కానున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం యూయూ లలిత్ బాధ్యతలను స్వీకరించనున్నారు. పదవీ విరమణ చేయబోతోన్న సీజేఐ ఎన్వీ రమణను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఘనంగా సన్మానించనుంది. దీనికోసం ప్రత్యేకంగా వీడ్కోలు సభను నిర్వహించబోతోంది.

సాయంత్రం 4:15 నిమిషాలకు సుప్రీంకోర్టు అదనపు భవన సముదాయంలో గల మెయిన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ఏర్పాటయింది. తదుపరి సీజేఐ యూయూ లలిత్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, సభ్యులు దీనికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను సన్మానించారు. వీడ్కోలు సభను నిర్వహించారు. ఈ సభలో ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
కాగా- ఎన్వీ రమణ పదవీ విరమణ చేయబోతోన్న చివరి రోజు సందర్భంగా సుప్రీంకోర్టు ఓ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్వీ రమణ బెంచ్ సమక్షానికి వచ్చే వాదనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. వెబ్కాస్ట్ ద్వారా ఇది లైవ్ స్ట్రీమ్ కానుంది. దీనికి సంబంధించిన లింక్ - https://webcast.gov.in/events/MTc5Mg--.
ఈ లింక్ను క్లిక్ చేయడం ద్వారా సీజేఐ ఎన్వీ రమణ బెంచ్ చేపట్టిన పిటీషన్లపై వాదనలు, తీర్పులను ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. ఇలాంటి ఘటన సుప్రీంకోర్టు చరిత్రలో ఇదివరకెప్పుడూ లేదు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ఈ ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఇచ్చే ఆర్థికపరమైన హామీలు, ఉచిత పథకాలకు సంబంధించిన పిటీషన్లపై సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇవ్వాళ ఆదేశాలను జారీ చేయనుంది.












Click it and Unblock the Notifications