ఢిల్లీ సరిహద్దుల్లో రైతులను ఖాళీ చేయిస్తారా... నేడు సుప్రీం ముందుకు కీలక పిటిషన్.. ఏం జరగబోతుంది?
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 21వ రోజుకు చేరింది. మరోవైపు రైతులను తక్షణం సరిహద్దుల నుంచి ఖాళీ చేయించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ బుధవారం(డిసెంబర్ 16) విచారణకు రానుంది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే,జస్టిస్ ఏఎస్ బోపన్న,జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యంలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరపనుంది.
పిటిషన్లో ఏముంది...
రిషభ్ శర్మ అనే న్యాయశాస్త్ర విద్యార్థి సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశాడు. రైతులు రోడ్లను దిగ్భంధించి ఆందోళన చేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఇలా వేలాది మంది రైతులు ఒకే చోట చేరడం కోవిడ్ 19 వ్యాప్తికి దారితీయవచ్చునని పేర్కొన్నాడు. నిజానికి బురారీలోని నిరంకారి మైదానంలో శాంతియుత నిరసనకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ... రైతులు మాత్రం ఇప్పటికీ ఢిల్లీ సరిహద్దులోని రోడ్ల పైనే ఆందోళనలు చేస్తున్నారని ప్రస్తావించారు.
అర్జెంటుగా ఖాళీ చేయించాలని...
'ఢిల్లీ సరిహద్దుల్లో నుంచి రైతులను తక్షణమే ఖాళీ చేయించడమో,చెదరగొట్టడమో చేయాలి. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే వారికి కేటాయించిన ప్రదేశానికి వారిని తరలించాలి. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం అత్యవసరంగా ఈ విషయంలో స్పష్టమైన సూచనలు చేయాలి.' అని రిషభ్ శర్మ తన పిటిషన్లో పేర్కొన్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత రైతులు తమ ఆందోళనలను కొనసాగించుకోవచ్చునని... ఇప్పుడైతే ఆందోళనలను విరమించడం అత్యవసరమని పేర్కొన్నారు. రహదారులను దీర్ఘకాలం ఆక్రమించుకోవడం తగదని గతంలో షాహీన్బాగ్ ఆందోళనల సందర్భంగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా గుర్తుచేశారు.
ఏం జరగబోతుంది..?
రైతుల ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన)-2020,రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020,నిత్యావసర సరకుల(సవరణ) బిల్లు.. కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాలను రద్దు చేయాలని రైతులు గత 21 రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. చట్టాల్లో కనీస మద్దతు ధర ప్రస్తావన లేకపోవడం,కార్పోరేట్లు వ్యవసాయాన్ని ఆక్రమించి రైతులను కూలీలుగా చేసే ప్రమాదం ఉండటం,దేశ ఆహార భద్రతకే ముప్పు పరిణమించే ప్రమాదం ఉందన్న కారణాలతో రైతులు ఆందోళనకు దిగారు. అటు ప్రభుత్వం కూడా కొత్త చట్టాలను రద్దు చేసేందుకు సిద్దంగా లేకపోవడంతో ఈ ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ముందుకు బుధవారం రిషభ్ శర్మ పిటిషన్ విచారణకు రానుండటంతో... న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ రైతులను ఖాళీ చేయించాలని సుప్రీం ఆదేశాలిస్తే.. రైతు సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.