ప్రధాని మోడీ సెక్యూరిటీ బ్రీచ్: శుక్రవారం విచారించనున్న సుప్రీంకోర్టు, కేంద్రం, పంజాబ్కు నోటీసులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో చోటు చేసుకున్న భారీ భద్రతా వైఫల్యం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. ప్రధాని మోడీ కాన్వాయ్ కు భద్రతా వైపల్యంపై అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.
Recommended Video
పంజాబ్ పాలకులు దురుద్దేశంతోనే భద్రతా వైఫల్యం సృష్టించారని, దేశ భద్రతకే ఇది తీవ్రమైన విఘాతమని పిటిషనర్ వాదించారు. ప్రోటోకాల్ ప్రకారం.. ప్రధాని కాన్వాయ్ లో చీఫ్ సెక్రటరీ, డీజీపీ కూడా ఉండాలన్నారు. కానీ, ప్రధాని కాన్వాయ్లో వారిద్దరూ లేరిని వెల్లడించింది. భద్రతా ఏర్పాట్లపై ఆధారాలను భఠిండా జిల్లా జడ్జి వద్ద ఉంచేలా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉదయం విచారించనుంది. పిటిషన్పై సమాధానం ఇవ్వాలని కేంద్రానికి, పంజాబ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
మరోవైపు, భద్రతా వైఫల్యంపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి మెహ్తాబ్ గిల్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ వర్మలతో కూడిన ఈ కమిటీ ఘటనపై విచారణ జరిపి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
కాగా, పంజాబ్ లో ప్రధానికి భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఆందోళనలపై నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ.. పంజాబ్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ బ్లూ బుక్ ను ఆ రాష్ట్ర పోలీసులు పాటించలేదని కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానమంత్రి భద్రత ఏర్పాట్లకు పాటించాల్సిన మార్గదర్శకాలన్నీ బ్లూ బుక్ లో ఉంటాయి. దీని ప్రకారం.. ప్రధాని పర్యటనలో బుధవారం నాటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రాలు ఆకస్మిక మార్గాన్ని సిద్ధం చేయాలి. అనూహ్య ఘటనలు జరిగినప్పుడు రాష్ట్ర పోలీసులు.. స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్కు అప్డేట్ చేసి అందుకు అనుగుణంగా వీఐపీల ప్రయాణాలను మార్చాలి.
కానీ, పంజాబ్ పోలీసులు అలా చేయలేదు. అంతేగాక, నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు పంజాబ్ పోలీసులతో కాంటాక్ట్ లోనే ఉంటూ.. ఆందోళనకారుల గురించి అప్రమత్తం చేశాయి. అయినా, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేంద్ర హోంశాఖ సీనియర్ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.