కావేరీ నీటి వివాదంపై నేడు తీర్పు: కర్ణాటక, తమిళనాడు బస్సులు బంద్, హైఅలర్ట్!
Recommended Video
బెంగళూరు: దశాబ్దాలపాటు సాగిన కావేరీ జల వివాదంపై నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. నీటి పంపిణిలపై 2007నాటి కావేరీ జల వివాద పరిష్కార ట్రైబ్యనల్ తీర్పును వ్యతిరేకిస్తూ తమిళనాడు, కర్ణాటక, కేరళ వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుంచి కేసు విచారణ జరిగింది.
తీర్పు రిజర్వు
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ అప్పీళ్లపై విచారణ చేపట్టింది. అనంతరం గత ఏడాది సెప్టెంబరు 20న తీర్పును రిజర్వు చేసింది.
కర్ణాటకకు చివాట్లు
కేసు విచారణ సమయంలో తమిళనాడుకు నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటకకు సుప్రీం కోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అనేకసార్లు ధిక్కరించిన కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టింది.
తమిళనాడు, కర్ణాటకలో హైఅలర్ట్
కావేరీ జలాల పంపిణి విషయంపై సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులు బలగాలు మొహరిస్తున్నాయి.
బస్సు సర్వీసులు బంద్
కావేరీ నీటి పంపిణి విషయంలో తీర్పు రానున్న సందర్బంగా ముందు జాగ్రత్త చర్యగా తమిళనాడు- కర్ణాటక అంతరాష్ట్ర బస్సు సర్వీసులు పూర్తిగా రద్దు చేశారు. గురువారం రాత్రి తమిళనాడు బస్సులు కర్ణాటకకు, కర్ణాటక బస్సులు తమిళనాడు వెళ్లాయి. రెండు రాష్ట్రాల్లోని ఆ బస్సులను ఆయా ప్రాంతాల్లో నిలిపివేశారు.
సరిహద్దులో సాయుధ బలగాలు
కర్ణాటక-తమిళనాడు సరిహద్దు అయిన అత్తిబెలె దగ్గర ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు మొహరిస్తున్నాయి. తమిళనాడు వాహనాలు కర్ణాటకలోకి, కర్ణాటక వాహనాలు తమిళనాడులోకి వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.