తేదీ ఖరారుపై: టిపై షిండే, అన్యాయం నిజమే: సుష్మా
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ ఖరారు పైన తాము దృష్టి సారించామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం చెప్పారు. ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉదయం కలిశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి పాలనకు సంబంధించి తమకు గవర్నర్ నుండి ఎలాంటి నివేదిక అందలేదని చెప్పారు.
పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో ఇక తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీ ఖరారుపై దృష్టి సారించామన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలా లేక కొత్త ప్రభుత్వమా అనే విషయమై ఆలోచిస్తున్నామని షిండే చెప్పారు.
సీమాంధ్రకు అన్యాయం వాస్తవం: సుష్మా
సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ శుక్రవారం అన్నారు. తాము ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణకు మద్దతు తెలిపి మాట నిలబెట్టుకున్నామన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక సీమాంధ్రకు న్యాయం చేస్తుందన్నారు.
రాజధానిపై జెపి
రాజధాని ఉన్న ప్రాంతం విడిపోవడం ఇదే ప్రథమమని లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రెండు ప్రాంతాలకు కేంద్రం నుండి నిధులు రావాలని అన్నారు. రాష్ట్ర విభజన అంశంపై తమ పార్టీ లోతైన వ్యూహాన్ని అనుసరించిందని చెప్పారు.