ఎయిర్ పోర్టులో బాంబు పెట్టింది నేనే.. యూట్యూబ్ లో చూసి బాంబు చేశాను!
బెంగళూరు/మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులోని బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టిన నిందితుడు ఆదిత్యరావ్ (34) కర్ణాటక డీజీపీ కార్యాలయంలో బుధవారం స్వచ్చందంగా లొంగిపోయాడు. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టింది నేనే అని పోలీసులకు చెప్పడంతో వారు షాక్ కు గురైనారు. ఎయిర్ పోర్టులో తనకు ఉద్యోగం ఇవ్వలేదని కసి, పగతో యూట్యూబ్ లో బాంబులు ఎలా తయారు చెయ్యాలి ? అని నేర్చుకుని బాంబు తయారు చేసి పెట్టానని ఆదిత్యరావ్ చెప్పడంతో పోలీసుల దిమ్మతిరిగిపోయింది.
ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !
బీఇ, ఎంబీఏ విద్యాభ్యాసం
ఉడిపిలోని మణిపాల్ లోని మణ్ణపల్లద హుడ్కో కాలనీలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ఆదిత్య క్రిష్ణమూర్తి రావ్ అలియాస్ ఆదిత్య రావ్ మైసూరు యూనివర్శిటీలో బీఇ (మెకానికల్), ఎంబీఏ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఉద్యోగం చెయ్యాలని ఆశతో బెంగళూరు వచ్చాడు. అయితే బెంగళూరు ఎయిర్ పోర్టు అధికారులకు సరైన పత్రాలు ఇవ్వడంలో విఫలమైన ఆదిత్య రావ్ ఉద్యోగం సంపాధించలేకపోయాడు. ఆదిత్య రావ్ తండ్రి క్రిష్ణమూర్తి రావ్ రిటైడ్ బ్యాంక్ మేనేజర్. ఆదిత్య రావ్ తల్లి చనిపోయారు. ఆదిత్య రావ్ సోదరుడు ప్రస్తుతం బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.
ఉద్యోగం రాలేదని కసి, పగ
బెంగళూరు ఎయిర్ పోర్టులో తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఆదిత్య రావ్ కసి పెంచుకున్నాడు. 2018లో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, మెజస్టిక్ సమీపంలోని సంగోళ్ళి రాయణ్ణ సెంట్రల్ రైల్వేస్టేషన్ లో బాంబులు పెట్టామని ఆదిత్య రావ్ ఫోన్ చేసి బెదిరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు 2018 ఆగస్టు 29వ తేదీ ఆదిత్య రావ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన ఆదిత్య రావ్ తరువాత మంగళూరులో తండ్రితో కలిసి నివాసం ఉంటున్నాడు.
యూట్యూబ్ లో బాంబులు ఎలా చెయ్యాలి ?
తనకు ఉద్యోగం ఇవ్వకుండా వేధింపులకు గురి చేసిన ఎయిర్ పోర్టు అధికారుల మీద కసి తీర్చుకోవాలని ఆదిత్య రావ్ నిర్ణయించాడు. బాంబులు ఎలా తయారు చెయ్యాలి ? అనే విషయం ఒక సంవత్సరం పాటు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాడు. బాంబులు తయారు చెయ్యడానికి ఉగ్రవాదులను సంప్రధించడానికి ప్రయత్నించాడు. అయితే ఆదిత్య రావ్ హిందువు కావడంతో ఉగ్రవాదులను కలవడం సాధ్యం కాలేదని తెలిసింది.
మారువేషంలో బెంగళూరుకు !
మంగళూరు ఎయిర్ పోర్టు టిక్కెట్ కౌంటర్ సమీపంలో మంగళవారం ఉదయం బాంబు పెట్టిన ఆదిత్య రావ్ తరువాత తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఎయిర్ పోర్టులో బాంబు గుర్తించిన పోలీసులు నిందితుల కోసం మంగళూరు, ఉడిపితో పాటు చిక్కమగళూరు, హాసన్, మడికేరి, మైసూరు తదితర ప్రాంతాల్లో సోదాలు చేశారు. మంగళవారం అర్దరాత్రి మారు వేషంలో మంగళూరు జాతీయ రహదారిలోకి వెళ్లిన ఆదిత్య రావ్ ఓ ట్యాంకర్ (లారి) ఎక్కి బెంగళూరు చేరుకున్నాడు.
సీసీ టీవీ కెమెరాల్లో ఉంటే ఎలా ?
మంగళూరు ఎయిర్ పోర్టులో బాంబు పెట్టే సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో తాను చిక్కపోయానని, తప్పించుకోవడం సాధ్యం కాదని తెలుసుకుని బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో డీజీపీ నీలమణి రాజు ముందు లొంగిపోయానని ఆదిత్య రావ్ పోలీసు అధికారుల ముందు అంగీకరించాడని తెలిసింది. ఆదిత్య రావ్ కు బెంగళూరులోని సెయింట్ మారథాస్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి మంగళూరు పోలీసులకు అప్పగించడానికి హలసూరు గేట్ పోలీసు అధికారులు సిద్దం అయ్యారు.
ఆన్ లైన్ లో గన్ పౌడర్
బాంబులు తయారు చెయ్యడానికి గన్ పౌడర్ ఆన్ లైన్ లో కొనుగోలు చేశానని ఆదిత్య రావ్ పోలీసుల విచారణలో అంగీకరించాడని తెలిసింది. తరువాత మంగళూరులోని బల్మఠ సమీపంలోని తాను పని చేస్తున్న హోటల్ లో ఆదిత్య రావ్ గన్ పౌడర్ దాచిపెట్టాడని, తరువాత బాంబు తయారు చేశాడని పోలీసు అధికారులు అంటున్నారు.
హోటల్ లో ఉద్యోగం
ఆదిత్య రావ్ ప్రస్తుతం మంగళూరులోని కుడ్ల క్వాలిటీ హోటల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నెల రోజుల నుంచి అక్కడే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో ఆదిత్య రావ్ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. రోజు ఉద్యోగానికి బ్యాగ్ తీసుకు వచ్చే ఆదిత్య రావ్ దానిని అతని దగ్గరే దాచిపెట్టుకునే వాడని, ఎవ్వరితో మాట్లాడకుండా అతని పని అతను చేసుకుని వెళ్లేవాడని హోటల్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బార్ అండ్ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్న ఆదిత్య రావ్ ప్రతి రోజు అక్కడ మాత్రం భోజనం చెయ్యలేదని, పక్కనే ఉన్న శాఖాహార హోటల్ లో భోజనం చేసేవాడని తెలిసింది. ఆదిత్య రావ్ తండ్రి క్రిష్ణమూర్తి రావ్, అతని సోదరుడిని మంగళూరు పోలీసు అధికారులు విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.