సునంద హత్య: మరో బాంబు పేల్చిన స్వామి, థరూర్ ఫైర్
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులో బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరో బాంబు పేల్చారు. సునంద పుష్కర్ను చంపిందెవరో శశి థరూర్కు తెలుసునని ఆయన అన్నారు. థరూర్ ఆ విషయంలో నోరు విప్పాలని ఆయన అన్నారు. సునంద పుష్కర్ను శశి థరూర్ చంపారని తాను ఏ రోజు కూడా అనలేదని ఆయన స్పష్టం చేశారు.
ఐపియల్ సహా పలు విషయాలను శశి థరూర్ మరుగుపరుస్తున్నారని ఆయన విమర్శించారు. థరూర్ను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. అయితే, సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలను శశి థరూర్ ఖండించారు. సునంద పుష్కర్ను చంపిందెవరో తెలిస్తే సుబ్రహ్మణ్య స్వామి బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
"అతనెవరు? ఆయనకు హంతకుడు తెలిస్తే పోలీసులకు చెప్పమనండి" అని శశి థరూర్ అన్నారు. సునంద పుష్కర్ను చంపిందెవరో సుబ్రహ్మణ్య స్వామి తెలుసునంటున్నారని, తెలిస్తే చెప్పాలని ఆయన అన్నారు. దానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిస్పందిస్తూ - తనకు హంతకుడు తెలుసునని తాను అనలేదని, హంతకుడెవరో శశి థరూర్కు తెలుసునని తాను అంటున్నానని అన్నారు.
కాగా, మరో రెండు రోజుల్లో శశి థరూర్ను విచారిస్తామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బిఎస్ బస్సీ ఎన్డీటివీతో అన్నారు. సునంద పుష్కర్ (51) ఏడాది క్రితం ఢిల్లీలోని ఓ హోటల్లో మరణించారు. సునంద పుష్కర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని ఢిల్లీ పోలీసులు ఈ నెలారంభంలో కేసు నమోదు చేశారు. సునంద పుష్కర్ను విషమిచ్చి చంపారని వైద్య పరీక్షల్లో తేలింది.
శశి థరూర్ పనిమనిషి నారాయణ్తో పాటు పలువురిని పోలీసులు ఇటీవల ప్రశ్నించారు. మూడోసారి నారాయణ్ను పోలీసులు విచారించారు. మొదటి రెండు విడతల్లో పోలీసులు నారాయణ్ను విపరీతంగా కొట్టారని శశి థరూర్ ఆరోపించారు. ఆ మేరకు పోలీసు చీఫ్కు ఆయన రాసిన లేఖ గతవారం వెలుగు చూసింది.