తమిళ హీరోలను వణికిస్తున్న 'దినేశ్'-అజిత్కు బాంబు బెదిరింపు కాల్-ఎవరీ వ్యక్తి... ఎందుకిలా చేస్తున్నాడు?
తమిళ సూపర్ స్టార్ అజిత్ ఇంటికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన ఓ అగంతకుడు అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో బాంబ్ స్క్వాడ్ టీమ్ హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకుని ఇల్లంతా తనిఖీలు చేశారు. అర్థరాత్రి వరకూ తనిఖీలు చేసినా ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది ఫేక్ బెదిరింపు కాల్గా నిర్దారించారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోగా అతనో మానసిక వికలాంగుడని... అతని పేరు దినేశ్ అని గుర్తించారు.

గతంలో రజనీ,విజయ్లకూ దినేశ్ బెదిరింపు కాల్స్..
ఇదే దినేశ్ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్,తలపతి విజయ్ ఇళ్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దినేశ్ ఇంటికి వెళ్లిన పోలీసులు మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని అతని తల్లిదండ్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. గతంలోనూ పోలీసులు దినేశ్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను మందలించారు.
దినేశ్ చేతికి మొబైల్ ఫోన్ ఇవ్వొద్దని హెచ్చరించారు. అప్పటినుంచి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ... దినేశ్ ఎలాగోలా వారికి తెలియకుండా దినేశ్ ఫోన్లు తీసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. అప్పట్లో దినేశ్ పరిస్థితి గురించి తెలుసుకున్న రజనీకాంత్... అతని చదువుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని ప్రకటించారు.

అజిత్కు ఇది నాలుగోసారి...
చెన్నైలోని ఇంజంబాక్కమ్లో ఉన్న హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ రావడం ఇది నాలుగోసారి. గతేడాది మారక్కమ్ అనే ప్రాంతం నుంచి భువనేశ్ అనే వ్యక్తి కూడా ఇలాగే ఫోన్ చేసి బెదిరించాడు. అతనిపై అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకుముందు 2014,2017ల్లోనూ అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. సెలబ్రిటీల ఇళ్లకు వరుస బాంబు కాల్స్ చెన్నై పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇలాంటి ఫేక్ కాల్స్ చేసేవారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అజిత్ మూవీ అప్డేట్
సినిమాల విషయానికి వస్తే అజిత్ ప్రస్తుతం బోనీ కపూర్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న వాలీమై(Valimai) చిత్రంలో నటిస్తున్నారు. ఎచ్.వినోద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయికగా నటిస్తుండగా కార్తికేయ విలన్గా కనిపించనున్నాడు. సినిమాలో అజిత్ పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'దీపావళి' కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. 2018లోనే ఈ సినిమాను ప్రకటించినప్పటికీ పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. 2019లో అజిత్ నటించిన విశ్వం,నేరుకొండ పార్వై చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications