ముఖ్యమంత్రిగా విజయ్ తొలి బహిరంగ సభ.. తిరుచ్చిలో.. రీజన్ ఇదే!
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తన మొట్టమొదటి అధికారిక పర్యటనకు రెడీ అయ్యారు. జూన్ 1వ తేదీన ఆయన తిరుచ్చి జిల్లాలో సీఎం విజయ్ పర్యటించనున్నారు. సీఎంగా పదవిని చేపట్టిన తర్వాత ఆయన ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సీఎం విజయ్ తొలి పర్యటన ఇక్కడే.. ఎందుకంటే
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. అయితే నిబంధనల ప్రకారం ఆయన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, తనను భారీ మెజారిటీతో గెలిపించిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు స్వయంగా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ పర్యటనను ఖరారు చేసుకున్నారు.

తిరుచ్చిలో విజయ్ భారీ బహిరంగ సభ
ఇందుకోసం టీవీకే పార్టీ శ్రేణులు తిరుచ్చిలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం బాధ్యతలు చేపట్టిన విజయ్.. మంత్రివర్గ విస్తరణ, ఎన్నికల హామీల అమలు, పొత్తుల నిర్వహణ, అలాగే ఢిల్లీ పర్యటన వంటి అత్యవసర ప్రభుత్వ పనులతో బిజీగా గడిపారు. ఈ పనులన్నీ విజయవంతంగా ముగించుకున్న తర్వాత ఆయన ప్రజల ముందుకు వస్తున్నారు.
రేపు సాయంత్రం బహిరంగసభలో సీఎం విజయ్
షెడ్యూల్ ప్రకారం, సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ కృతజ్ఞత సభ ప్రారంభం కానుంది. విజయ్ చెన్నై నుంచి విమానంలో తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఓపెన్ వ్యాన్ లో ప్రయాణిస్తూ, టీవీఎస్ టోల్ గేట్ మరియు ఓల్డ్ డెయిరీ ఫామ్ మీదుగా సెయింట్ జోసెఫ్ కాలేజీ గ్రౌండ్స్ కు చేరుకుంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కృతజ్ఞతా సభలను ప్లాన్ చేసిన విజయ్
ఈ మార్గమధ్యంలో రోడ్డుకు ఇరువైపులా ఉండే ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన స్వయంగా అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలుపుతారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ తిరుచ్చి పర్యటన ముగిసిన తర్వాత, విజయ్ రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నట్లు, ఈ మేరకు కృతజ్ఞతా సభలు నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.













Click it and Unblock the Notifications