టాటా సన్స్ చేతికి ఎయిరిండియా: వంద శాతం ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరణ
నష్టాల్లో పయనిస్తున్న ప్రముఖ ఎయిరిండియా సంస్థ ఇక పై లాభాల బాట పట్టనుందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం అనుబంధంగా సాగిన ఎయిరిండియా విమానాయాన సంస్థను బిడ్డింగ్ ద్వారా టాటా సన్స్ దక్కించుకుంది. ఇప్పటికే 43వేల కోట్ల నష్టాలతో ఎయిరిండియా నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే బిడ్డింగ్ నిర్వహించింది. బిడ్డింగ్ సందర్భంగా దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్ ఈ బిడ్డింగ్ను దక్కించుకుంది.
Recommended Video
ఎయిరిండియాను దక్కించుకున్న టాటా సన్స్
ఎయిరిండియా సంస్థ కోసం నిర్వహించిన బిడ్డింగ్లో టాటాసన్స్ మరియు మరో విమానాయాన సంస్థ స్పెస్ జెట్ కూడా పోటీ పడింది. అయితే చివరకు ఈ పోటీలో టాటా సన్స్ నిలిచి బిడ్డింగ్ను గెల్చుకుంది. ఇక టాటా సన్స్ చేతికి ఎయిరిండియా వెళ్లడంతో కచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుందని పలువురు మార్కెట్ అనలిస్టుటు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు ఎయిరిండియా విమానాలను టాటా సంస్థే నిర్వహించేది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ సంస్థను జాతీయం చేశారు. ఇక తాజాగా టాటా సన్స్ ఎయిరిండియా బిడ్ను దక్కించుకోవడంతో 67ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ దక్కించుకున్నట్లయ్యింది.
ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడులు ఉపసంహరణ
ఇక బిడ్ ముగియడంతో ఎయిరిండియా సంస్థ టాటా వశమైనట్లయ్యింది. డిసెంబర్ నాటికి ఎయిరిండియా సంస్థ టాటా చేతిలోకి అధికారికంగా వెళ్లనుంది. ఎయిరిండియాలో కేంద్ర ప్రభుత్వం 100శాతం పెట్టుబడులు ఉపసంహరించుకుంది. దీంతో అతిపెద్ద ప్రభుత్వ ఉపసంహరణ ప్రక్రియగా నిలిచింది. ఇక బిడ్డింగ్ ముగిసిందని టాటా సన్స్కు బిడ్డింగ్ దక్కిందని ఓ అధికారి చెప్పారు. అయితే మంత్రుల బృందం దీన్ని అధికారికంగా ఆమోదం తెలుపుతుందని ఆయన చెప్పారు.అయితే ఇది కేబినెట్ ఆమోదం పొందాల్సిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.
స్పైస్ జెట్ కంటే అధికంగా బిడ్ దాఖలు
ప్రస్తుతం టాటా గ్రూప్ సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి విస్తారా ఎయిర్లైన్స్ పేరుతో విమానాయాన సర్వీసులను నిర్వహిస్తోంది. అంతేకాదు ఎయిర్ ఏషియాలో కూడా తమ వాటాలను 83.67శాతంకు పెంచుకుంది. ఇక ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు కేంద్రం సెట్ చేసిన రిజర్వ్ ధర కంటే రూ.3వేల కోట్లు ఎక్కువగాను, అదే సమయంలో ఎయిరిండియా బిడ్ను దక్కించుకునేందుకు పోటీపడ్డ స్పైస్ జెట్ సంస్థ దాఖలు చేసిన బిడ్ ధర కంటే టాటా సన్స్ రూ.5వేల కోట్లు అధికంగా బిడ్ దాఖలు చేసి ఎయిరిండియా సంస్థను దక్కించుకుంది. అయితే రూ.15వేల కోట్లు నుంచి రూ.20 వేల కోట్లు రిజర్వ్ ధరను సెట్ చేసి ఉంటుందని వచ్చిన వార్తలపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది.
డిసెంబర్ నాటికల్లా టాటాసన్స్ చేతికి
ఇక బిడ్డింగ్ సందర్భంగా వేసిన కమిటీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలు ఉన్నారు. ఇదిలా ఉంటే టాటా సన్స్కు ఎయిరిండియాను పూర్తిగా అప్పగించే ప్రక్రియ డిసెంబర్ నాటికల్లా పూర్తవుతుందని తెలుస్తోంది. మరో ప్రముఖ ఎయిర్లైన్స్ ఎయిర్ఏషియాను కూడా ఎయిరిండియా కిందకు తీసుకురావాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు సమాచారం. 2018లోనే ఎయిరిండియా సంస్థను ప్రైవేటీకరణ చేద్దామని కేంద్రం ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. అయితే 2020 జనవరిలో మరోసారి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించి 2021 అక్టోబర్ 1వ తేదీన టాటా సన్స్ దక్కించుకోవడంతో ముగిసింది.