తుఫాను బీభత్సం: సముద్రంలో మునిగిన నౌక, 22 మంది మృతదేహాలు లభ్యం, 65 మంది కోసం గాలింపు
ముంబై: ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి నుంచి కొంత కోలుకుంటున్న మహారాష్ట్రలో తౌక్టే తుఫాను రూపంలో మరో విపత్తు వచ్చి పడింది. గత కొద్ది రోజులుగా తౌక్టే తుఫాను కారణంగా మహారాష్ట్రలో ముఖ్యమంగా ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. తుఫాను బీభత్సంతో 40 మందికిపైగా మరణించారు.
మరోవైపు తౌక్టే తుఫాను కారణంగా బాంబే హై ప్రాంతంలో భారీ నౌకలు అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన ఘటనలో 22 మంది మృతదేహాలను నౌకాదళాలు బుధవారం గుర్తించి తీరానికి తీసుకొచ్చాయి. గల్లంతైన మరో 60 మందికిపైగా సిబ్బంది కోసం గాలింపు కొనసాగిస్తున్నాయి. తుఫాను ఉధృతికి బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద పీ-305 అనే భారీ నౌక లంగరు ఊడిపోయి సముద్రంలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
ఈ సమేరకు సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ వెంటనే యుద్ధ నౌకలను రంగంలోకి దింపి సహాయక చర్యలు చేపట్టింది. అయితే, తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌక నీటిలో మునిగిపోయి కనిపించింది. ప్రమాద సమయంలో 261 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌక నుంచి ఇప్పటి వరకు 185 మందిని నేవీ సహాయక సిబ్బంది కాపాడారు. బుధవారం 22 మంది మృతదేహాలను గుర్తించారు.
ప్రస్తుతం మిగిలినవారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, గాల్ కన్ స్ట్రక్టర్ కు చెందిన బార్జ్ కొట్టుకుపోగా.. అందులోని 137 మందిని నేవీ సిబ్బంది కాపాడారు. ఎస్ఎస్-3 అనే బార్జ్ పై 196 మంది సిబ్బంది, ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిక్ సాగర్భూషణ్పై 101 మంది సురక్షితంగా ఉన్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఈ తుఫాను మహారాష్ట్రతోపాటు గుజరాత్, కేరళ, గోవాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.