11వ అంతస్తు నుంచి పడి మహిళా టెక్కీ మృతి
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు ఇంజినీర్ గ్రాడ్యుయేట్ కవితగా గుర్తించడం జరిగింది. 10ఏళ్ల నుంచి అమెరికాలో ఉన్న కవిత నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చింది. నగరంలో తన స్నేహితులతో కలిసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. కేరళకు చెందిన కవిత కుటుంబ సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా నగరంలోని రాజాజినగర్లో నివాసం ఉంటున్నారు.
పార్టీ జరుపుకునేందుకు కవిత తన స్నేహితులు విద్యా, కళ్యాణ్ వర్మలతో కలిసి సహకార్నగర్లో నివాసం ఉంటున్న మరో స్నేహితుని ఇంటికి మంగళవారం రాత్రి వెళ్లింది. పార్టీ ముగిసిన అనంతరం తన నివాసంలో ఉండాలని వర్మ.. కవిత, విద్యాలను కోరాడు.
ఆ ముగ్గురు బుధవారం ఉదయం 2.20గంటల ప్రాంతంలో వర్మ నివాసానికి చేరుకున్నారు. వర్మ ఈ మెయిల్స్ పరిశీలిస్తుండగా విద్యా నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో కవిత బాల్కనీ హాల్ లోకి వెళ్లింది. కొంతసేపటికి కవిత అరుపును విన్న వర్మ అక్కడికి వెళ్లి చూడగా బాల్కనీ నుంచి ఆమె కింద పడిపోయింది. ఘటన స్థలంలోనే కవిత మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అపార్ట్ మెంట్లోని ఒక బాల్కనీ నుంచి మరో బాల్కనీకి జంప్ చేయాలని ప్రయత్నించగా కిందపడి మరణించినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. కవిత బంధువుల కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదు.
సిసి కెమెరా ఫుటేజి ఆధారంగా ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేరళకు వెళ్లిన కవిత తల్లిదండ్రులు విషయంతో తెలుసుకుని హుటాహుటిన బెంగళూరుకు చేరుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కవిత పార్థీవ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.