టెక్కీVsలెగ్గీ?: సౌత్లో కుంబ్లేతో నీలేకని ఫేస్ టు ఫేస్
బెంగళూరు: కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు ప్రముఖులు అనిల్ కుంబ్లే, నందన్ నీలేకనిలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? ఇరువురు ముఖాముఖి తలపడనున్నారా? అంటే కావొచ్చునంటున్నారు. ఐటి సెక్టార్ నుండి వచ్చిన నందన్ నీలేకని ఆధార్ కార్డ్స్ హెడ్గా ఉన్నారు. కుంబ్లే మాజీ క్రికెటర్.
నీలేకని ఐటి బెల్వెదర్ ఇన్ఫోసిస్ స్థాపకుల్లో ఒకరు. ఆయన ప్రస్తుతం యుఐడిఏఐ, ఆధార్లకు హెడ్గా ఉన్నారు. అనిల్ కుంబ్లే భారత్ క్రికెట్ జట్టు తరఫున ఆడిన దిగ్గజ ఆటగాడు. వీరు బెంగళూరు దక్షిణ నుండి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట. నీలేకని కాంగ్రెసు పార్టీ తరఫున, కుంబ్లే భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగవచ్చునంటున్నారు.
ప్రస్తుతం బెంగళూరు దక్షిణ నియోజకవర్గ నుండి బిజెపి తరఫున అనంతకుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తన సొంత నియోజకవర్గం హుబ్లీ నుండి పోటీ చేసే అవకాశాలున్నాయట.
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి కర్నాటకలో ప్రచారం కోసం ఇరవై మంది అభ్యర్థుల లిస్టును ఇచ్చారట. అనిల్ కుంబ్లేను తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపితే 18-20 సీట్ల వరకు గెలుచుకోవచ్చునని బిజెపి భావిస్తోందట. అందుకోసం కుంబ్లే కోసం ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. కాంగ్రెసు కూడా నీలేకనిని బరిలోకి దింపే ప్రయత్నాలు చేస్తోందట.
టెక్కీ నీలేకనిని కాంగ్రెసు, మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లేలను బిజెపి బెంగళూరు దక్షిణ నుండి బరిలో దింపాలని యోచిస్తున్నాయట. అయితే, వీరి ఆఫర్లకు వారు ఏమాత్రం స్పందిస్తారనేది చూడాలి. బెంగళూరు ఐటి ఇండస్ట్రీకి ఫేమస్. అక్కడ ఎక్కువమంది టెక్కీలు ఉంటారు. దీంతో నీలేకనిని బరిలోకి దింపి లబ్ధి పొందాలని కాంగ్రెసు చూస్తోందట. కుంబ్లే ఇమేజ్ను బిజెపి సొమ్ము చేసుకోవాలని చూస్తోందట.