వెల్లోకి పురంధేశ్వరి: లిస్ట్లో కెవిపి ఫస్ట్, కాంగ్రెస్కి చిరాకు
గందరగోళం మధ్యనే సభాపతి మీరా కుమార్ ప్రశ్నోత్తరాలను కొనసాగించే ప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో మీరా కుమార్ సభను గంట పాటు వాయిదా వేశారు. ఇక, రాజ్యసభ ప్రారంభం కాగానే సీమాంద్ర ప్రాంత సభ్యులు వెల్లోకి వెళ్లి తమ నిరసనను తెలిపారు. సమైక్యాంధ్ర ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సభను గంటపాటు వాయిదా వేశారు.
మొదటి పేరు కెవిపిదే
సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ సభా మర్యాదలకు భంగం కలిగిస్తున్నారంటూ పదకొండు మంది పార్లమెంటు సభ్యుల పేర్లను రాజ్యసభ సచివాలయం బులెటిన్లో బుధవారం చేర్చారు. అందులో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావుది కూడా ఉంది. అంతేకాదు ఆయన పేరే మొదట ఉంది. టిడిపి సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ల పేర్లు ఉన్నాయి.
కాంగ్రెసు పార్టీ సభను అదుపులో పెట్టక పోవడంపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అభ్యంతరకరం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల సభ్యుల కన్నా ముందే కాంగ్రెసు సభ్యులు కెవిపి సభామద్యలోకి దూసుకొస్తున్నారన్నారు. అధికార పక్షం తమ సభ్యులను అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.
కేంద్రమంత్రులు జైరామ్ రమేష్, రాజీవ్ శుక్లాలు కూడా కెవిపితో మాట్లాడారు. కాంగ్రెసు సభ్యుల్లో ఆయన ఒక్కరే అదుపు తప్పి వ్యవహరిస్తున్నారని, ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీకి తమను తప్పు పట్టే అవకాశం కల్పిస్తున్నారని హెచ్చరించారు. అయితే, తాను వేరే ఏ విషయంలోనేనా పార్టీ మాట వింటానని, సమైక్యాంధ్ర విషయంలో మాత్రం తగ్గేది లేదని చెప్పారు.