10న రాజ్యసభలో టీ బిల్లు: షిండే, వెంకయ్య కొలికి
న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లును (తెలంగాణ బిల్లును) ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్కు మంగళవారం లేఖ రాశారు. ఫిభ్రవరి 6వ తేదీన తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకువెళ్ళాలని జీవోఎం నిర్ణయించింది.
ఆ వెంటనే 7వ తేదీన తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ముందుకు వెళ్లనుంది. రాష్ట్రపతి, కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఫిభ్రవరి 10వ తేదీన తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలని షిండే నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బిల్లుపై జీవోఎం కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ బిల్లుపై పలు సవరణలపై జీవోఎం మంగళవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, కిల్లికృపారాణి, పురందేశ్వరి, కోట్ల పాల్గోన్నారు. అసెంబ్లీలో కొన్ని కీలక సవరణలతో పాటు మరికొన్ని సవరణలు చేర్చిన జీవోయం తెలంగాణ బిల్లుకు అమోద ముద్ర వేసింది.
కాంగ్రెసులోనే తెలంగాణపై భిన్నాభిప్రాయాలున్నాయని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఇరు ప్రాంతాల నాయకులను ఒకతాటిపైకి తేవడంలో కాంగ్రెసు విఫలమైందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ముందు కాంగ్రెసు తన పార్టీని సక్రమం చేసుకోవాలని ఆయన అన్నారు. తాము తెలంగాణకు మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలు తమను వదిలేసినట్లు భావించడానికి వీలు లేకుండా చేసే బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.
కాగా, తెలంగాణపై తమ వైఖరి మారిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మద్దతు ఇచ్చే విషయంలో తాము వెనక్కి తగ్గబోమని ఆయన మంగళవారం అన్నారు. తమపై కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్సించారు.