యుటిపై డిగ్గీ: రిజైన్ తర్వాత సొంతింటికి కిరణ్, పార్టీపై...!
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు)కు లోకసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ బుధవారం స్పందించారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎమ్మెల్యేల హక్కులు తిరస్కరించినట్లే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలతో తెలంగాణ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని తెలిపారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. బిల్లు నేపథ్యంలో పార్లమెంటు సభ్యులు కొంత పరిణితితో వ్యవహరించి ఉంటే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమయ్యేదన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలన్న యూపిఏ సంకల్పం నెరవేరిందని, సీమాంధ్ర ఎంపీలు చర్చలో పాల్గొంటే బాగుండేదన్నారు. కాగా, ఈ రోజు రాజ్యసభకు తెలంగాణ బిల్లు రానుంది.

రాజీనామా తర్వాత సొంతింటికి కిరణ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రాజీనామా చేయనున్నారు. పదకొండు గంటలకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు. ఆ తర్వాత తనతో కలిసి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా రాజ్ భవన్కు వెళ్తారు. గవర్నర్ నరసింహన్కు తన రాజీనామాను సమర్పిస్తారు. ఆ తర్వాత క్యాంపాఫీసుకు కాకుండా సొంతింటికి కిరణ్ వెళ్తారు.
మరోవైపు, రాజీనామా అనంతరం కొత్త రాజకీయ పార్టీని స్థాపించడంపై కిరణ్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. అయితే సమైక్యవాదాన్ని బలంగా విన్పించిన నేతలను కూడగట్టడంతోపాటు, కిరణ్ను నమ్ముకుని అధిష్ఠానాన్ని సైతం ధిక్కరించిన ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను దృష్టిలో ఉంచుకుని కిరణ్ పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీని స్థాపించాలని కిరణ్పై తాము ఒత్తిడి తెస్తామని లేదంటే, కిరణ్ను నమ్ముకున్న వాళ్లకు రాజకీయంగా నష్టం జరుగుతుందంటున్నారు.












Click it and Unblock the Notifications