ట్రంప్, మెలానియాతో కేసీఆర్ కరచాలనం.. పాత విషయాన్ని గుర్తుచేసిన సీఎం
రెండ్రోజుల భారత పర్యటనలో చివరి అంకంగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మంగళవారం రాష్ట్రపతి భవన్ లో విందు స్వీకరించారు. ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి భవన్ లోకి అడుగుపెట్టిన ట్రంప్ కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ వెంటరాగా.. రాష్ట్రపతి కోవింద్ ముందుగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ట్రంప్ కు పరిచయం చేశారు. ఆ పక్కనే వరుసగా నిలబడ్డ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రంగాల ప్రముఖులను కలుస్తూ ట్రంప్, మెలానియా ముందుకు కదిలారు.
Recommended Video

రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ తో పరిచయ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ముందువరసలో నిలబడ్డారు. ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతో కేసీఆర్ కరచాలనం చేశారు. అరనిమిషంపాటు ట్రంప్ తో మాట్లాడిన కేసీఆర్.. ఏదో పాతవిషయాన్ని గుర్తుచేయగా, అమెరికా ప్రెసిడెంట్ నవ్వులు చిందించారు. రాష్ట్రపతి కోవింద్, ఆయన సతీమణికి కూడా కేసీఆర్ నమస్కరించారు.

అమెరికా ప్రెసిడెంట్ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో రాజకీయ నేతలతోపాటు పారిశ్రామిక, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మొత్తం 88 మందికి మాత్రమే ఆహ్వానాలు వెళ్లిన సంగతి తెలిసిందే. విందులో శాఖాహార వంటలతోపాటు మాంసాహారాన్ని కూడా వండివార్చారు. మెనూలో దాల్ రైసినా, పుట్టగొడుగుల కూర, మటన్ దమ్ బిర్యానీ, ఢిల్లీ స్టైల్ కుండ బిర్యానీ, ఫిష్ టిక్కా, సలాడ్లు, స్వీట్లు తదిరత వంటకాలున్నాయి.

రెండోరోజు పర్యటనలో భాగంగా ట్రంప్.. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. భారత పారిశ్రామిక దిగ్గజాలతోనూ ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ లో కాశ్మీర్ వివాదం, సీఏఏ, ఢిల్లీలో హింస అంశాలపైనా ట్రంప్ కామెంట్లు చేశారు. రాష్ట్రపతి భవవన్ లో విందు తర్వాత ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ట్రంప్ స్వదేశానికి బయలుదేరి వెళతారు.












Click it and Unblock the Notifications