సిఎంది తొండి తీర్మానం, విలువ లేదు: జైపాల్ రెడ్డి
న్యూఢిల్లీ: ఫిబ్రవరి మూడవ వారంలో తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు. విభజనను నిరోధించామని సీమాంధ్ర నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, దీని వల్ల ప్రయోజనం ఏమి ఉండదని వారు గుర్తించాలని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చేసిన తొండి తీర్మానాల వల్ల పార్లమెంటు అధికారం ఏ మాత్రం తగ్గబోదని జైపాల్ తెలిపారు. తెలంగాణ ముసాయిదా బిల్లును అభిప్రాయాలు తెలిపేందుకు మాత్రమే రాష్ట్రపతి అసెంబ్లీకి పంపారని జైపాల్ రెడ్డి తెలిపారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ముగిసే కొన్ని సెకన్ల ముందు ఎవ్వరికీ నోటీసు లేకుండా మూజువాణిలో ఏకపక్షంగా ఆమోదించడం తప్పుడు విధానమని, ముఖ్యమంత్రి తీర్మానానికి చట్టపరమైన, రాజకీయ విలువ లేదని తెలిపారు. తీర్మానం వల్ల పార్లమెంటుకు ఉన్న అధికారాన్ని తగ్గిస్తామనుకోవడం నామమాత్రమేనని అన్నారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టబడుతుందని, జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాది పార్టీలు బిల్లు మద్దతు తెలిపుతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్, బిజెపి, బిఎస్పి లాంటి జాతీయ పార్టీలు తమ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాయని చెప్పారు. అందుచేత పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తెలిపారు.
సీమాంధ్ర నాయకులు తమకు అన్యాయం జరిగిందంటున్నారని, వారికి ఏం అన్యాయం జరిగిందో కేంద్రానికి వివరించాలని ఆయన కోరారు. తీర్మానం తెలుగు ప్రజల ప్రతిష్టను గానీ, అసెంబ్లీ ప్రతిష్టను గానీ పెంచే విధంగా లేదని అన్నారు. వివాదగ్రస్తమైన తీర్మాన్ని మూజువాణిలో ఎలా చేస్తారని, దానికి ఎలా సార్థకత ఉంటుందని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు. సీమాంధ్ర నాయకుల్లో భ్రమలు వద్దని, తెలంగాణ ప్రజల్లో ఆందోళన వద్దని ఆయన అన్నారు. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ప్రాంతాల వారీగా విడిపోయారని చెప్పారు.
పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి చెప్పారు. తాను తెలంగాణపై బిజెపి పార్టీ చిత్తశుద్ధిని శంకించడం లేదని తెలిపారు. గతంలో రాజమండ్రిలోనే తెలంగాణ ఇస్తామని బిజెపి ప్రకటించిందని గుర్తు చేశారు. 1969లో కూడా తెలంగాణ ఇస్తామని బిజెపి ప్రకటించిందని వెల్లడించారు. బిల్లులో సవరణలు కోరవచ్చని, సీమాంధ్ర నాయకులతో కేంద్రం మాట్లాడుతుందని చెప్పారు.
తీర్మానానికి ఏ మాత్రం బలం లేదని, పసలేదని అన్నారు. తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్రల్లో అనేకమంది తెలుగు వారున్నారని, వారందరూ ఆంధ్రప్రదేశ్లో లేరని గుర్తుంచుకోవాలని సీమాంధ్ర నాయకులకు సూచించారు. అంతటా ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పారు. ఏకపక్షంగా ఐక్యత కోరడం ఎలా ఉంటుందని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు లేకుండా తెలుగుజాతి ఉంటుందా అని ప్రశ్నించారు. రాజ్యం నడవడానికి ఏకాభిప్రాయం లేదని అన్నారు. అసెంబ్లీ తీర్మానం వల్ల విభజన ఆగిపోతుందనుకోవడం భ్రమేనని చెప్పారు.
ఆర్టికల్ 3కి సర్వసత్తాక అధికారం ఉందని జైపాల్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల విభజన చేసే అధికారం పార్లమెంటుకు ఉందని చెప్పారు. సుప్రీం కోర్టులో ఎన్నో సమయాల్లో ఈ విషయం తేలిందని పేర్కొన్నారు. ముళ్ల పెరియార్, బాబూలాల్ పరాటా కేసుల్లో ఆర్టికల్ 3 అధికారాన్ని వివరించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ సభ్యుల అంగీకారం లేకుండా అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా పాస్ చేసినట్లవుతుందా అని జైపాల్ రెడ్డి ప్రశ్నించారు.
పార్లమెంటుకు చెవులు మాత్రమే కాదు, కళ్లు కూడా ఉన్నాయని అన్ని గమనిస్తోందని జైపాల్ రెడ్డి తెలిపారు. బిజెపి, బిఎస్పి తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు చొరవ తీసుకుందని ఆయన చెప్పారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. తప్పుడు విధానాలతో ప్రజల్లో ఆందోళనను పెంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడితన తర్వాత ఈ ఆవేశాలు నిలువవని జైపాల్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications